ప్రజాశక్తి -పొదలకూరు :రాష్ట్ర ప్రజలకు పోలేరమ్మ, గంగమ్మ తల్లుల ఆశీస్సులు ఉండాలని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. పొదలకూరు పట్టణంలోని పోలేరమ్మ ఆలయంలో మంగళవారం జరిగిన 11వ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పోలేరమ్మ ఆలయంతో పాటు, పక్కనే ఉన్న గంగమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పొదలకూరులో గ్రామ దేవతలు ప్రసిద్ధిగాంచారని పేర్కొన్నారు. గ్రామంలోని ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఆలయ పునర్నిర్మాణ దాత వూకోటి లక్ష్మీనారాయణ, ఆలయ కమిటీ చైర్మన్ మొలబంటి శేఖర్ ఆధ్వర్యంలో వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. స్థానిక ప్రజాప్రతినిధులు, పొదలకూరు సర్పంచ్ మల్లిక చిట్టెమ్మ, మండల వైసిపి నాయకులు బ్రహ్మయ్య ,మద్దిరెడ్డి రమణారెడ్డి, వాకాటి శ్రీనివాసులు రెడ్డి, ఎం. శేఖర్, వేణుగోపాల్ రెడ్డి, లక్ష్మీనారాయణ, వేమయ్య ఉన్నారు.










