పంటపొలాల పై గజదాడులు
- సదుం మండలం చేరుకున్న ఏనుగుల మంద - ఆందోళనలో రైతన్నలు
ప్రజాశక్తి- సోమల: సోమల మండలంలోని పలు పంచాయతీలలో రైతుల పంటలను ధ్వంసం చేస్తూ తీవ్రనష్టాన్ని కలిగిస్తూ వస్తున్న ఏనుగుల మంద ప్రస్తుతం సదుం మండలానికి చేరుకొని అక్కడి రైతుల పంటలపై దాడులు చేస్తూ రైతులకు తీవ్రనష్టాన్ని వేదనను మిగులుస్తున్నాయి. బుధవారం అర్ధరాత్రి చెరుకువారిపల్లె పంచాయతీ పోతుంవారిపల్లెకు చెందిన హేమప్రసాద్, ధనుంజయ అనే రైతులకు చెందిన అరటి, చెరకు పంట పొలాలపై దాడులు చేసి నష్టం కలిగించాయని దాదాపు 8 నుండి 15 ఏనుగులు వచ్చినట్టుగా ఆనవాళ్లు కనిపిస్తున్నాయని రైతులు తెలియజేశారు. ఏనుగులు ధ్వంసం చేసిన పంటపొలాలను వీఆర్వో పురుషోత్తం వెళ్లి పరిశీలించారు. మండల అటవీశాఖ వారు ఏనుగులను ఈ ప్రాంతం నుండి దూరంగా తరిమివేసి తమ పంటలకు రక్షణ కల్పించాలని రైతులు కోరుతున్నారు.










