Aug 16,2023 21:15

పంట నమోదును పరిశీలిస్తున్న జిల్లా వ్యవసాయ అధికారిణి ఉమామహేశ్వరమ్మ

         ప్రజాశక్తి-రాయదుర్గం రూరల్‌   రైతులు సాగు చేసిన పంటలను తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారిణి ఉమామహేశ్వరమ్మ సూచించారు. బుధవారం మండల పరిధిలోని బి.ఎన్‌.హళ్లి పంచాయతీ పరిధిలో చేపట్టిన ఈపంట నమోదును ఆకస్మికంగా పరిశీలించారు. ఇందులో భాగంగా యాప్‌లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా.. అనిరైతు భరోసా కేంద్రం సిబ్బందితో ఆరాతీశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈపంట నమోదు పూర్తి చేసేందుకు రైతులు సహకరించాలన్నారు. ఈ పంట నమోదు చేసే సర్వే నెంబర్ల వివరాలు ముందుగానే రైతులు, విఆర్‌ఓకు తెలపాలని రైతు భరోసా సిబ్బందికి సూచించారు. రైతు తమ పొలంలో ఉండే విధంగా చూసుకుని ఏ పంట సాగు చేసి ఉంటే ఆ పంటను, ఖచ్చితమైన విస్తీర్ణంలో యాప్‌లో నమోదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాయదుర్గం సహాయ వ్యవసాయ సంచాలకులు లక్ష్మానాయక్‌, మండల వ్యవసాయ అధికారి మహేంద్ర, రైతు భరోసా కేంద్రం సిబ్బంది నరేష్‌కుమార్‌, రైతులు పాల్గొన్నారు.