May 24,2023 22:08

జగన్న విద్యాకానుక కిట్లను పరిశీలిస్తున్న కలెక్టర్‌ పి.అరుణ్‌ బాబు

         పరిగి : పాఠశాలలు పున్ణ ప్రారంభం కాగానే విద్యార్థులకు పంపిణీ చేసేలా జగనన్న విద్యాకానుక స్టాక్‌ అంతా సిద్ధంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ పి.అరుణ్‌బాబు సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జగనన్న విద్యాకానుక స్టాక్‌ పాయింట్‌ను పరిశీలించారు. టెస్ట్‌ బుక్కులు, యూనిఫామ్‌, బెల్ట్‌ లు తదితర వాటిని పరిశీలించారు. పాఠశాలకు ఎంత స్టాక్‌ వచ్చింది అనే వివరాలను ఆరా తీశారు. షూలు, నోట్‌బుక్స్‌ రావాల్సి ఉందని ఎంఇఒ కలెక్టర్‌కు తెలిపారు. స్టాక్‌ అంతా రాగానే నిబంధనల ప్రకారం స్కూల్‌ పాయింట్ల చేర్చేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు.
గార్మెంట్స్‌ పరిశీలన
పరిగి పరిధిలోని నిషా డిజైన్స్‌ పరిశ్రమ, హిందూపురం పారిశ్రామిక వాడలో ఏపీ ఇంజినీరింగ్స్‌, పవర్‌ గేర్‌ లిమిటెడ్‌ పరిశ్రమలను కలెక్టర్‌ పరిశీలించారు. పరిశ్రమలో పనిచేసే కార్మికులు మాస్కులను ధరించాలని, దీని ద్వారా దుమ్ము, దూళి నుంచి రక్షణ లభిస్తుందన్నారు. పరిశ్రమలలో ప్రభుత్వ నిబంధనల మేరకు భద్రత ప్రమాణాలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో పెనుకొండ సబ్‌ కలెక్టర్‌ కార్తీక్‌, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్‌ మేనేజర్‌ ఎస్‌.చాంద్‌బాషా, ఏపీపీసీబీ ఎన్విరాన్మెంటల్‌ అధికారి శంకర్‌రావు, ఫ్యాక్టరీస్‌ డిప్యూటీ చీఫ్‌ ఇన్స్‌పెక్టర్‌ కేశవులు, పరిగి డిప్యూటీ తహశీల్దార్‌ లక్ష్మీ నరసింహ, ఎంపీడీవో సరస్వతి పాల్గొన్నారు.