
ప్రజాశక్తి -నక్కపల్లి:నక్కపల్లిని కరువు మండలం గా ప్రకటించి రైతులను, కూలీలను అన్ని విధాలా ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.అప్పలరాజు డిమాండ్ చేశారు. బుధవారం తహసిల్దార్ కార్యాలయం వద్ద ఏపీ రైతు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి ధర్నా చేపట్టారు. ఫ్లకార్డులు, ఎండిన వరి చేనును చేత పట్టుకుని వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆదుకోవాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అప్పలరాజు మాట్లాడుతూ, మండలంలో ఖరీఫ్ సీజన్కు సంబంధించి 5125 ఎకరాలు సాధారణ విస్తీర్ణం కాగా, వర్షపాతం లోటు కారణంగా 1219 ఎకరాల్లో మాత్రమే రైతులు వరి నాట్లు వేయడం జరిగిందన్నారు. వర్షాలు ముఖం చాటేయడంతో వేసిన వరి నాట్లు కూడా ఎండుతున్నాయని, దీంతో పెట్టుబడులు పెట్టిన రైతులు తీవ్రంగా నష్ట పోయారని ఆవేదన వ్యక్తం చేసారు. ఎకరానికి 35 వేల నుండి 40 వేల వరకు రైతులు అప్పులు చేసి పెట్టుబడులు పెట్టారని, వరి ఫైరు ఎండి పోవడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో రైతులు కొట్టు మిట్టాడుతున్నారన్నారు. చెరువులు, కాలువలు, బావుల్లో చుక్కనీరు కనిపించలేదన్నారు. వర్షాలు లేకపోవడంతో బీడు భూములుగా దర్శనమిస్తున్నాయన్నారు. రైతులకు రుణమాఫీ చేయాలని, ఎకరానికి రూ.25,000 నష్టపరిహారం చెల్లించాలని, ఆర్బికేల్లో తేలికపాటి విత్తనాలను రైతులకు ఉచితంగా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.ఉపాధి హామీ పథకం పనులు ప్రారంభించి రైతులు, కూలీలను ఆదుకోవాలన్నారు. కరువు పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి చర్యలు చేపట్టాలని తహసీల్దార్ అంబేద్కర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు వి.అప్పారావు, ఎం.మహేష్బాబు, ఆర్.దండు బాబు, ఏ.అప్పలరాజు, ఏ.అప్పారావు పాల్గొన్నారు .
కోటవురట్ల:కరువు మండలంగా ప్రకటించి నివారణ చర్యలు చేపట్టాలని సిపిఐ నాయకులు మండలంలో పలు సచివాలయాల వద్ద నిరసనలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ సంఘం జిల్లా అధ్యక్షులు వెలుగుల అర్జునరావు, ప్రధాన కార్యదర్శి మాకిరెడ్డి రామానాయుడు మాట్లాడుతూ, పంటలు ఎండిపోవడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పరవాడ: మండలంలో పంటలు లేక రైతులు తీవ్రమైన నిరాశతో, ఆందోళనలో ఉన్నారని, మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి రైతులను, వ్యవసాయ కార్మికులను ఆదుకోవాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పరవాడ, తానాం, వెన్నెలపాలెం, గొర్లివానిపాలెం గ్రామాల్లో పర్యటించి కరువు పరిస్థితులను రైతులను అడిగి తెలుసుకున్నారు. వర్షాలు లేక వరి పంట వేయక పనులు లేక వ్యవసాయ కార్మికులు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే పరవాడ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని గనిశెట్టి డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతులు, వ్యవసాయ కార్మికులతో ఆందోళన చేపడతామని గనిశెట్టి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్.అప్పారావు, జి.సన్యాసిరావు, కన్నమనాయుడు, రవణమ్మ తదితరులు పాల్గొన్నారు.