
ప్రజాశక్తి- సబ్బవరం
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపు మేరకు 'దేశం చేస్తుంది రావణ దహనం - మనం చేద్దాం జగనాసుర దహనం' అనే కార్యక్రమం జిల్లాలోని పలు చోట్ల టిడిపి శ్రేణులు నిర్వహించారు. ఇందులో భాగంగా సబ్బవరం మండలంలోని మొగలిపురం గ్రామంలో మనం చేద్దాం జగనాసుర దహనం కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు చేపట్టారు. ఈ సందర్భంగా సైకో పోవాలి-సైకిల్ రావాలి అంటూ నినాదాలు చేశారు. అనంతరం కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ తమరాన సన్యాసమ్మ బంగారు నాయుడు, మాజీ సర్పంచ్ బైలపూడి సత్యం, టీడీపీ గ్రామ అధ్యక్షుడు అంగటి నాని, గోటివాడ అప్పారావు, గండి నరేష్, శ్రీరాములు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
దేవరాపల్లి : టిడిపి రాష్ట్ర కమిటీ ఆదేశాలు మేరకు దేశం చేస్తుంది రావణ దహనం - మనం చేద్దాం జగనాసుర దహనం అనే కార్యక్రమం సోమవారం రాత్రి మండలంలోని కాశీపురం గ్రామంలో నిర్వహించారు. టిడిపి మండల అధ్యక్షుడు చిటిమిరెడ్డి సూర్యనారాయణ ఆధ్వర్యంలో సైకో పోవాలి అనే నినాదంతో ఉన్న పత్రాలను మంటలలో వేసి దహనం చేశారు. మంగళవారం రాత్రి సీతంపేట గ్రామంలో టిడిపి మాడుగుల నియోజకవర్గం ఇన్ఛార్జి పివిజి కుమార్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.
కాగడాలతో నిరసన
అచ్యుతాపురం : చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా సోమవారం రాత్రి టిడిపి ఎలమంచిలి నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రగడ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో అచ్యుతాపురంలో కాగడాలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
నాగజగదీష్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
అనకాపల్లి : జగనాసుర దహనం కార్యక్రమం నేపథ్యంలో టిడిపి అనకాపల్లి జిల్లా అధ్యక్షులు బుద్ధ నాగ జగదీశ్వరరావును ఆయన స్వగృహం వద్ద పోలీసులు నోటీసు ఇచ్చి అదుపులోకి తీసుకొని టౌన్ పోలీస్ స్టేషన్కి తరలించారు. ఈసందర్భంగా నాగజగదీష్ మాట్లాడుతూ టిడిపి శ్రేణులకు భయపడి పిరికిపందలా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి హౌస్ అరెస్టులకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీలను చూసి ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి నిద్ర పట్టడం లేదన్నారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ప్రజల మధ్యనే ఉంటూ వైసిపి ప్రభుత్వంపై పోరాటం చేస్తామన్నారు.