
ప్రజాశక్తి - గుంటూరు జిల్లా ప్రతినిధి : గురటూరు, పల్నాడు జిల్లాల్లోని పలు గ్రామ పంచాయతీల్లో భూగర్భ డ్రైయినేజి వ్యవస్థ ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ నిర్ణయం కాగితాలకే పరిమితమైంది. గత ప్రభుత్వ హయాలో ఉమ్మడి జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో పరిధిలో మొత్తం 15 గ్రామాల్లో ఈ వ్యవస్థ ఏర్పాటుకు రూ.58.03 కోట్లు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2018లో ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వం నిధులు కేటాయించినా అప్పట్లో పనులు చేపట్టలేదు. ప్రణాళిక రూపొందించినా కార్యరూపం దాల్చలేదు. తర్వాత అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం ఈ పనులను అసలు పట్టించుకోలేదు. తాజాగా గత నాలుగేళ్లలో గ్రామ పంచాయతీలకు తగిన నిధులు కేటాయించకపోవడంతో గ్రామాల్లో మురుగునీటి పారుదలకు చర్యలు లేకుండా పోయాయి. భూగర్భ డ్రెయినేజి వ్వవస్థ కాదు కాదా సాధారణంగా రోడ్లపై నిల్వ ఉన్న వర్షపునీరు బయటకు పొయేందుకు కూడా గ్రామ పంచాయతీలు ప్రణాళికలు రూపొందించలేకపోతున్నారు. కాల్వల్లో మురుగు నీరు కూడా రోజుల తరబడి పేరుకుపోతోంది.
14, 15 ఆర్థిక సంఘం నిధులను పంచాయతీలు పూర్తిగా ఖర్చుపెట్టుకునేందుకు అవకాశం లేకపోవడంతో గ్రామాల్లో పారిశుధ్యమూ అధ్వానంగా మారుతోంది. మురుగునీటి పారుదల్లేక దోమల బెడద తీవ్రంగా ఉంటోంది. దీంతో వ్యాధులతో గ్రామీణ ప్రాంతవాసులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం గ్రామాల్లో సైడ్ కాల్వల వ్యవస్థ సక్రమంగా లేక మురుగు నీరు పారుదల కష్టతరంగా మారింది. దీంతో తరచూ పారిశుధ్య సమస్యలు తలెత్తుతున్నాయి. గ్రామాల్లో ఇళ్లల్లో వాడకంనీరు, వర్షం నీరు పారుదలకు సరైన అవకాశం లేక భారీ వర్షాలు కురిస్తే మురుగు నీరుకూడా ఇళ్లల్లోకి వచ్చే పరిస్థితి చాలా గ్రామాల్లో నెలకొంది. మండల కేంద్రాల్లోనూ పరిస్థితి దుర్బరంగా మారుతోంది.
గత ప్రభుత్వ హయాంలో సిమెంట్ రోడ్లు నిర్మించినా సైడ్ కాల్వలు నిర్మించకపోవడం వల్ల మురుగు అంతా ఇళ్ల ముందే చేరుతోంది. ఇళ్లల్లోని వాడకం నీరు బయటకు పోయే మార్గాల్లేక చాలా గ్రామాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాలు, మండల కేంద్రాల్లో సైతం ఇళ్లలో వాడకం నీరు పారుదలకు సైడుకాల్వల వ్యవస్థ సక్రమంగా లేదు. వర్షం వస్తే కాలువల్లో మురుగు రోడ్డుపైకి వస్తోంది. దీంతో తొలుత కొన్ని మేజర్ పంచాయతీల్లో భూగర్భ డ్రెయినేజి పథకం అమలు చేయాలని ఆలోచనలు చేసినా అవి కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం పారిశుధ్య సిబ్బందికి జీతాలు ఇవ్వడమే కష్టంగా ఉందని సర్పంచ్లు వాపోతున్నారు. ప్రస్తుతం ఆరునెలలుగా వారికి జీతాలు రాని కారణంగా వారు పూర్తిస్థాయిలో విధులకు రాలేకపోతున్నారు. గ్రామాల్లో సైడ్ డ్రెయిన్లలో మురుగునీరు పారుదలకు చర్యలు, వ్యర్థాల తొలగింపు కష్టతరంగా మారింది. ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంపై పలుమార్లు సర్పంచ్లు నిరసన తెలిపినా ప్రభుత్వం తీరులో మార్పు లేదు.