ప్రజాశక్తి - భీమవరం రూరల్
పిలల్ల ఆరోగ్యంపై తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలని ప్రముఖ వైద్యులు గంధం విశ్వేశ్వరరావు అన్నారు. భీమవరం డాక్టర్ వైఎస్ఆర్ శాఖ గ్రంథాలయంలో నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన శిబిరాల్లో యోగా, చిత్రలేఖనం, నృత్యాలపై శనివారం శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరావు మాట్లాడుతూ వేసవి విజ్ఞాన శిబిరాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ పూజ్యశ్రీ గురువులు రవి శంకర్ జయంతి, యోగా జాతీయ సమైక్యత ప్రతిజ్ఞ నిర్వహించామని, డాక్టర్ గంధం విశ్వేశ్వరరావు సహకారంతో బాలలకు డ్రాయింగ్ బుక్స్, విద్యా సామగ్రి, స్వీట్స్ పంపిణీ చేశామని తెలిపారు. గ్రంథాలయ అధికారి ఎస్.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వచ్చే నెల 11వ తేదీ నిర్వహించే వేసవి విజ్ఞాన శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అరసవల్లి సుబ్రహ్మణ్యం, కలిగోట్ల గోపాలశర్మ, తుమ్మలపల్లి బాలాజీ, డి.శ్యామ్, కె.శ్యామల, ఎన్.లక్ష్మి పాల్గొన్నారు.
నరసాపురం టౌన్ :నరసాపురం ప్రథమ శ్రేణి శాఖ గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిబిరంలో శనివారం పిల్లలు అధికసంఖ్యలో పాల్గొన్నారు. చందమామ కథలు, నీతి కథలు విద్యార్థులతో చదివించి చెప్పించారు. అనంతరం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. విశాఖపట్నం కెజిహెచ్ వైద్యురాలు స్పందన వైద్య సేవలందించారు. అనంతరం తెలుగు టూ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ క్లాస్, కెరీర్ గైడెన్స్, జికె క్లాసులు, పద్యాలు, యోగా క్లాసులు మెడిటేషన్ గేమ్స్ పలు అంశాలపై శిక్షణ ఇచ్చారు. బార్క్ శాస్త్రవేత్త సుబ్బారావు, సిహెచ్.శ్రీనివాస్, వాసు, సూర్యం బాబు, తోట శ్రీనివాస్, జీవన్కుమార్, ప్రిన్స్, ప్రవీణ్, భట్టిప్రోలు సత్యనారాయణ పాల్గొన్నారు. సుధీర్ మోహన్ పిల్లలకు స్నాక్స్, కూల్ డ్రింక్స్ పంపిణీ చేశారని గ్రేడ్ వన్ లైబ్రేరియన్ కెజెఎస్ ఎల్ కుమారి తెలిపారు.
ఉండి : యోగాసనాలతో ఆరోగ్యంగా ఉంటారని యోగా ఉపాధ్యాయురాలు వి.విశ్వజ్యోతి అన్నారు. వేసవి విజ్ఞాన శిబిరంలో భాగంగా శనివారం ఉండి శాఖ గ్రంథాలయంలో విద్యార్థులకు యోగాపై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి జెవి.కృష్ణమూర్తి పాల్గొన్నారు.










