Apr 28,2023 08:26

పిఎఫ్‌పై అవగాహన సదస్సులో పాల్గొన్న ఓబులు, అధికారులు

          బుక్కరాయసముద్రం : బుక్కరాయసముద్రం నుంచి సిద్ధరాంపురం గ్రామం వెళ్లే దారిలో ఉన్న పశుపుల ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఆఫీస్‌ వద్ద గురువారం ప్రావిడెంట్‌ ఫండ్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో అసిస్టెంట్‌ కమిషనర్‌ అశ్వినిరాజ, ఈఓ శ్రీనివాసులు నాయక్‌, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.ఓబులు, శ్రీరాంరెడ్డి, సత్యసాయి వాటర్‌ వర్క్స్‌ యూనియన్‌ నాయకులు కొన్ని ప్రతిపాదనలు చేశారు. ఓబులు మాట్లాడుతూ వేలాది మంది సంఘటిత, అసంఘటిత కార్మికులు పిఎఫ్‌కు సంబంధించి అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సదస్సు జరిగిన చిరునామా తెలియకపోవడంతో చాలామంది కార్మికులు వెనక్కి వెళ్లారని, కార్మిక సంఘాలకు ముందుగా వివరాలు తెలపాలన్నారు. అశ్వినిరాజ మాట్లాడుతూ పిఎఫ్‌ చట్టాన్ని అమలు చేయకపోతే నేరమని హెచ్చరించారు. సిఐటియు చేసిన సూచనలు కార్మిక సంఘాలకు ముందుగా తెలియజేస్తామని, ప్రతి నెలా 27 తేదీ అవగాహన సదస్సులు జరుపుతామని తెలిపారు. ఈ సదస్సులో జిల్లా పిఎఫ్‌ కార్యాలయ కార్యదర్శి చంద్రశేఖర్‌, వాటర్‌ సప్లై యూనియన్‌ నుంచి ఓబిలేసు, తిప్పేస్వామి , మండల సిఐటియు నాయకులు పాల్గొన్నారు