ప్రభుత్వ విద్యను పరిరక్షించుకునేందుకు మరో స్వాంతంత్య్ర ఉద్యమాన్ని చవిచూడాల్సి వస్తుందంటూ హెచ్చరించారు. ఎస్ఎఫ్ఐ విద్యారంగ పరిరక్షణ యాత్ర మంగళవారం శ్రీకాళహస్తికి చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక గిరిజన బాలికల కళాశాలలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ప్రసన్నకుమార్, అశోక్ సంయుక్తంగా మాట్లాడుతూ జగన్ సర్కార్ ప్రాథమిక విద్యను నీరుగార్చేందుకు కంకణం కట్టుకుందన్నారు. పథకాల్లో లొసుగులు చూపెట్టి విద్యాదీవెన, వసతి దీవెనలను పేద విద్యార్థులకు దూరం చేస్తోందని మండిపడ్డారు. జీవో 77 వల్ల పేద, మధ్యతరగతి విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం కావాల్సి వస్తోందని వాపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులన్నీ భర్తీ చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని కోరారు. ప్రభుత్వ విద్యారంగాన్ని నీరుగార్చే ఏ ప్రయత్నాన్నైనా ఎస్ఎఫ్ఐ సహించదనీ, ఉద్యమాలకు సిద్ధంగా ఉండాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. రాష్ట్ర సహాయ కార్యదర్శి రవి, జిల్లా నాయకులు శివ, శేఖర్, దిలీప్, రాఖేష్ తదితరులు పాల్గొన్నారు.










