
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : పైర్లను బెట్ట పరిస్థితులు నుండి కాపాడుకునేందుకు సూక్ష్మ పోషకాలు కలిగిన మందులను పిచికారీ చేయడం వలన కొంత మేర బెట్ట పరిస్థితులు ఎదుర్కొనేందుకు అవకాశం ఉంటుందని ఉద్యాన, వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు సూచించారు. నరసరావుపేట మండలంలోని పమిడిమర్రులో పొలాలను వారు గురువారం పరిశీలించారు. ఉద్యాన శాస్త్రవేత్త రజని మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితుల్లో నీటి సౌకర్యం లేని రైతులు మొక్కకు కావాల్సిన పోషకాలను పై పాటుగా పిచికారి చేయటం వల్ల మొక్కలకు కావాల్సిన పోషకాలు అంది ఎదుగుదల బాగుంటుందని చెప్పారు. దీనికి గాను క్యూబిక్ ఆసిడ్ 5 మిల్లీ లీటర్లను ఒక లీటర్ నీటికి 19-19-19 5 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయటం వలన మొక్కలు కొంత మేర బెట్ట పరిస్థితులు తట్టుకుంటాయని వివరించారు. జిల్లా ఉద్యాన శాఖాధికారి బిజె బెన్నీ మాట్లాడుతూ రైతులు డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటు చేసుకోవటం ద్వారా ఇలాంటి వర్షాభావ పరిస్థితుల నుండి తప్పించుకోవచ్చన్నారు. పంటలకు నీటి తడులు ఇచ్చేందుకు ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టకుండా తక్కువ ఖర్చుతో సాగు చేయాలన్నారు. డిడిఎ శివకుమారి మాట్లాడుతూ పత్తి, కంది పంటలేసిన రైతులు మల్టీ కె లేదా 19-19-19 మరియు 14-0-35ను పిచికారీ చేయాలని చెప్పారు. వరి పంటను పరిశీలించి దోమ ఉధృతి ఎక్కువగా ఉండడం వల్ల పొలం ఏర్రబారి ఉండడం గమనించి ఇతోపిన్ ఫ్రాక్స్ 2 మిల్లీ లీటర్లను ఒక లీటర్ నీటికి లేదా ఇమైడా క్లోప్రైడ్ 0.6 మిల్లీ లీటర్లను ఒక లీటర్ నీటికి పిచికారీ చేయాలని చెప్పారు. వ్యవసాయ అసిస్టెంట్ డైరెక్టర్ పి.మస్తానమ్మ మాట్లాడుతూ పమిడిమర్రులో ఈ-క్రాప్ నమోదు వివరాల జాబితాను సామాజిక తనిఖీ కోసం రైతు భరోసా కేంద్రంలో, సచివాలయంలో ప్రదర్శించినట్లు తెలిపారు. దీనిపై అభ్యంతరాలుంటే ఈ నెల 30వ తేదీలోపు రైతు భరోసా కేంద్రం లేదా గ్రామ ఉద్యాన మరియు సహాకులను కలిసి సరిచేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి వి.నరేంద్రబాబు, సర్పంచ్ డి.శ్రీనివాసరావు, నరసరావుపేట ఉద్యానశాఖ అధికారి నవీన్ కుమార్, గ్రామ ఉద్యాన సహాయకులు ఆంజనేయులు, శ్రీకాంత్రెడ్డి పాల్గొన్నారు.