పాఠశాలల్లో భద్రతా చర్యలు తప్పనిసరి : జేసీ
ప్రజాశక్తి - చిత్తూరు అర్బన్
'నాడు- నేడు' పనులు నిర్వహిస్తున్న పాఠశాలలో లేదా అంగన్వాడి కేంద్రాలలో ఎట్టి పరిస్థితుల్లోనూ భద్రతా చర్యలు తప్పనిసరిగా చేపట్టాలని, మొదటి, మూడవ విడత పనులను గుర్తించే ప్రక్రియను చేపట్టి అంచనాలను రూపొందించాలని జాయింట్ కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ అన్నారు. చిత్తూరు జిల్లాలో జరుగుతున్న రెండవ విడత నాడు- నేడు పనులకు సంబంధించి నిర్మాణాలు చేపట్టాల్సిన చర్యలు గురించి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ నాడు నేడు పనుల నిర్వహణకు ప్రత్యేకంగా రికార్డులను నిర్వహించాలని అన్నారు. పనులకు సంబంధించి ప్రధానోపాధ్యాయులు ఐదువేల రూపాయలు నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ నగదు రూపంలో చెల్లించకూడదని, భౌతికంగా జరుగుతున్న పనులను ఫోటో తీసి ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలని, సంబంధిత ఇంజనీరింగ్ అసిస్టెంట్తో చేయించాలని ఆదేశించారు. మరో 261 స్కూళ్లకు సంబంధించి లక్ష రూపాయల పైన ఉన్న నిధులు 7.5 కోట్లు ఉన్నాయని, వాటికి సంబంధించిన బిల్లులు పనులు చేయాలని అన్నారు. మొదటి, మూడో విడతకు సంబంధించి మరో 1,651 పాఠశాలలకు నిర్వహణ నిధులు మంజూరు కానున్నాయని, ఇందుకోసం అంచనాలను రూపొందించాలని, ఇప్పటివరకు 700 పాఠశాలలకు మాత్రమే రూపొందించారని, మిగతా పనులు వేగంగా రూపొందించాలని అన్నారు. అందరూ ఇంజనీరింగ్ అసిస్టెంట్ లు, ఎంఈఓ లు, ప్రధానోపాధ్యాయులు జరుగుతున్న పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్వ శిక్ష ఎపిసి వెంకటరమణారెడ్డి, డిఇఓ విజయేందర్రావు పాల్గొన్నారు.
గహ నిర్మాణాలు వేగవంతం చేయండి : జేసీ
గృహ నిర్మాణాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, క్షేత్రస్థాయి నుంచి అధికారుల వరకు అందరూ కలిసి పనిచేసి నిర్మాణాలను వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ అన్నారు. సోమవారం సాయంత్రం జాయింట్ కలెక్టర్ జిల్లా కేంద్రం నుంచి వీడియో కాన్ఫరెన్స్ను ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, ఎంపీడీవోలు, గహ నిర్మాణ సిబ్బందితో నిర్వహించారు. సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ పనుల నిర్వహణలో వెనకబడిన ఇంజనీరింగ్ అసిస్టెంట్లను క్షేత్రస్థాయి నుంచి ఉన్న పరిస్థితులను ప్రశ్నించారు. సిమెంటు ఇండెంట్ సకాలంలో పెట్టి తీసుకోవాలని ఆ విధంగా నిర్మాణ పనులకు సిమెంట్ కొరత లేకుండా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గహ నిర్మాణ శాఖ జిల్లా మేనేజర్ పద్మనాభం పాల్గొన్నారు.










