ప్రజాశక్తి- చిత్తూరు ప్రతినిధి
గ్రామంలోని 2.45 ఎకరాల స్థలంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల కొనసాగుతోంది. ఇక్కడి కొంత ఖాళీ స్థలం ఉంది. గతంలో ఇక్కడ పంచాయతీ భవనాన్ని నిర్మించగా.. దాన్ని ప్రస్తుతం గ్రామ సచివాలయంగా మార్చారు. ప్రభుత్వ పాఠశాలల స్థలాల్లో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు వంటివి ఉంటే ఖాళీ చేయాలన్న కోర్టు ఉత్తర్వులతో ఈ భవనాన్ని గత ఏడాది ఖాళీ చేయగా... పాఠశాల ఉపాధ్యాయులు ఆ భవనంలో తరగతి గదులు ఏర్పాటు చేసుకొని విద్యార్థులకు పాఠాలు చెబుతూ... ఆ స్థలం చుట్టూ ఇనుప ఫెన్సింగ్ సైతం వేయించారు. అయితే సోమవారం ఆకస్మికంగా రామకుప్పం మండలానికి చెందిన కొందరు వైసిపి నేతలు, ప్రజాప్రతినిధులు పాఠశాల వద్దకు చేరుకొని గదిలోని పిల్లలను బయటికి పంపేయడంతో పాటు... అక్కడ వేసిన ఫెన్సింగ్ను తొలగించారు. సచివాలయం ఇక్కడే కొనసాగించాలన్నదే వైసిపి నాయకుల వాదన. ఈ ఘటనతో విద్యార్థులు, ఉపాధ్యాయులు భయాందోళనకు గురయ్యారు. దీంతో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పోలీసు స్టేషన్లో కంప్లైట్ ఇచ్చారు. పోలీసులు ఆక్రమణకు యత్నించిన వారిపై కేసు నమోదు చేసి, కంప్లైట్ కాపీని కలెక్టర్, ఎంఇఓ, జెడ్పి సిఈఓకు పంపారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు తెలిపారు.










