ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్ సిఎం జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు సిపిఎస్ను రద్దు చేసి పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలని యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వి.కోటేశ్వరప్ప డిమాండ్ చేశారు. బుధవారం నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిఎం జగన్ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తయినా సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పకుండా దానిస్థానంలో జిపిఎస్ విధానాన్ని ఆర్డినెన్స్ రూపంలో తీసుకొస్తామని చెప్పడం బాధాకరమన్నారు. జిపిఎస్ విధానంలో ఎలాంటి మార్పు లేకుండా సిపిఎస్లో ఉన్న అంశాలను ఉంచి ఆడినెన్సు రూపంలో తీసుకురావడం చాలా దారుణమన్నారు. ఈ విషయమై మొన్న జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో తెలియజేస్తే బారుకాట్ చేశామన్నారు. ఉద్యోగుల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకుని ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు లింగమయ్య, ప్రధాన కార్యదర్శి గోవిందరాజులు, గౌరవాధ్యక్షులు రమణయ్య, ఉపాధ్యక్షులు రామప్పచౌదరి, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ దేవేంద్రమ్మ, నాగేంద్ర, తదితరులు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వి.కోటేశ్వరప్ప










