Apr 30,2023 21:48

మహిళతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి

         ప్రజాశక్తి-అనంతపురం   పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. ఆదివారం నగరంలోని 40వ డివిజన్‌లో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోవడంతోపాటు సంక్షేమ పథకాలపై ఆరాతీశారు. అనంతరం వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ఆయా కుటుంబాలకు కలిగిన లబ్ధిని వివరిస్తూ రూపొందించిన ప్రత్యేక బుక్‌లెట్లను అందజేశారు. ఈ సందర్భంగా శానిటేషన్‌ సిబ్బంది పనితీరు పట్ల అసహనం వ్యక్తం చేశారు. ప్రజలకు ఇబ్బంది కలుగకుండా శానిటేషన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సిఎం జగన్‌ నాయకత్వంలో రాష్ట్రంలో సంక్షేమ విప్లవం కొనసాగుతోందన్నారు. పేదల సంక్షేమం కోసం ఆలోచించే ప్రభుత్వం తమదన్నారు. కావున మరోసారి ప్రజలు జగన్‌ను ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేయర్‌ మొహమ్మద్‌ వసీం, డిప్యూటీ మేయర్లు వాసంతిసాహిత్య, కోగటం విజయభాస్కర్‌రెడ్డి, జిల్లా మైనారిటీ విభాగం అధ్యక్షుడు సైఫుల్లాబేగ్‌, జిల్లా మహిళా అధ్యక్షురాలు శ్రీదేవి, డైరెక్టర్లు గౌస్‌బేగ్‌, శ్రీనివాసులు, జేసీఎస్‌ కన్వీనర్‌ ఆలుమూరు శ్రీనివాస్‌రెడ్డి, మహిళా విభాగం నగర అధ్యక్షురాలు కృష్ణవేణి, ఎస్సీ సెల్‌ నాయకులు పెన్నోబిలేసు, నాయకులు ఖాదర్‌, షరీఫ్‌, ఇషాక్‌, గుజ్జల లక్ష్మణ్‌, సందీప్‌, పార్వతి, గౌతమి, షబ్బీర్‌, సల్లాఉద్దీన్‌, తదితరులు పాల్గొన్నారు.