పారిశుద్ధ్య పనుల్లో నిర్లక్ష్యం వద్దు : కమిషనర్
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: నగరంలో పారిశుద్ధ్య పనుల నిర్వహణలో నిర్లక్ష్యం వద్దని నగర కమిషనర్ డాక్టర్ జె.అరుణ స్పష్టం చేశారు. బుధవారం ఉదయం కమిషనర్ నగర పాలక పరిధిలోని మసీదుమిట్ట, నగరపాలక వాహనాల షెడ్ మస్టర్ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పారిశుద్ధ్య కార్మికుల హాజరు రిజిస్టర్లను పరిశీలించారు. పలువులు కార్మికుల హాజరును కమిషనర్ స్వయంగా ఎఫ్ఆర్ఎస్ విధానంలో నమోదు చేశారు. పారిశుద్ధ్య కార్మికుల హాజరు నమోదు సమయానికి ఇద్దరు కార్యదర్శులు రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. హాజరు నమోదు పక్కాగా నమోదు చేయాలన్నారు. అనంతరం నగరపాలక వాహనాల షెడ్డులో 5, 7,8 వార్డులకు సంబంధించి పారిశుద్ధ్య కార్మికుల హాజరు రిజిస్టర్లను పరిశీలించారు. స్థానిక మున్సిపల్ బస్టాండ్లో పారిశుద్ధ్యం మరింత మెరుగు పరచాలని కార్యదర్శిని ఆదేశించారు. పారిశుద్ధ్య కార్మికులు సమయపాలన పాటించాలని, నిర్దేశించిన సమయం వారి వార్డు పరిధిలో ఉండి, నిర్దేశించిన పనులను పూర్తి చేయాలన్నారు. 17వ వార్డు పరిధిలో 'క్లీన్ ఆంధ్రప్రదేశ్' కార్యక్రమంలో భాగంగా తడి/పొడి చెత్తను సేకరిస్తున్న ఆటోరిజిస్టర్లు తనిఖీ చేశారు. యూజర్ చార్జీల వసూళ్లపై వార్డు కార్యదర్శులతో సమీక్షించారు. పారిశుద్ధ్య పనులు నిర్దేశించిన ప్రణాళిక ప్రకారం పూర్తిస్థాయిలో జరగాలని వార్డు పారిశుద్ధ్య, పర్యావరణ కార్యదర్శులను ఆదేశించారు.










