
- ఐఎండీబీ మొదటి స్థానంలో 'జై భీమ్'
కరోనాతో తీవ్రంగా దెబ్బతిన్న చిత్రపరిశ్రమకు 2021లో ఓటీటీ విజయాల బాట వేసిందనే చెప్పొచ్చు. ఓ రకంగా చెప్పాలంటే బాక్సాఫీస్ను పరుగులు పెట్టించింది. కరోనా కారణంగా భారీ నష్టాలను చవిచూసిన చిత్ర పరిశ్రమ 2021లో ఓ కొత్త ట్రెండ్ సెట్ చేసింది. నెలల తరబడి థియేటర్లు మూతబడటంతో దక్షిణాది నుంచి బాలీవుడ్ వరకూ అన్ని పరిశ్రమల పరిస్థితీ ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఇదే సమయంలో ఓటీటీ వైపు దృష్టి సారించి, ఆ పరిస్థితి నుంచి బయటపడ్డారు. మొత్తంగా 2021 చిత్రపరిశ్రమకు మిశ్రమ ఫలితాలను అందించినా.. అనేక చిత్రాలు ఓటీటీ ద్వారా ప్రేక్షకుల మన్ననలు పొందాయి. కొన్ని సినిమాలు థియేటర్లలోనూ అలరించాయి.
2021 రౌండప్
ప్రముఖ ఎంటర్టైన్మెంట్ పోర్టల్ ఐఎండీబీ 2021 మోస్ట్ పాపులర్ ఇండియన్ సినిమాల జాబితాని ఇటీవల విడుదల చేసింది. యూజర్స్ని ఆధారంగా రూపొందించిన ఈ జాబితాలో సూర్య ప్రధానపాత్రలో నటించిన 'జై భీమ్' మొదటి స్థానాన్ని సొంతం చేసుకుంది.
టాప్ 10 సినిమాలివే..!
1. జై భీమ్ (సూర్య - కోలీవుడ్)
2. షేర్ షా
(సిద్ధార్థ్ మల్హోత్ర - బాలీవుడ్)
3. సూర్యవన్షీ
(అక్షయ్ కుమార్ - బాలీవుడ్)
4. మాస్టర్ (విజయ్ - కోలీవుడ్)
5. సర్దార్ ఉద్దమ్
(విక్కీ కౌశల్ - బాలీవుడ్)
6. మీమీ (కృతిసనన్ - బాలీవుడ్)
7. కర్ణన్ (ధనుష్ - కోలీవుడ్)
8. షిద్దత్ (సన్నీకౌశల్ - బాలీవుడ్)
9. దృశ్యం-2
(మోహన్లాల్ - మలయాళం)
10. హసీనా దిల్రూబా
(తాప్సీ - బాలీవుడ్)

తెలుగు చిత్ర పరిశ్రమకు 2021లో బాక్సాఫీస్ రన్ చాలా తక్కువ. అయితే ఎక్కువగా అద్భుతాలు సృష్టించిన సంవత్సరమూ ఇదేనని చెప్పవచ్చు. కొన్నాళ్ల క్రితం వరకూ సినీ వినోదాలంటే అందరి కళ్లూ థియేటర్ల వైపే చూసేవి. కరోనా పుణ్యమాని వెండితెర వినోదాలకు ఓటీటీ వేదికలు ప్రత్యామ్నాయంగా మారాయి. కరోనా నేపథ్యంలో గతేడాది చాలా చిత్రాలు ఈ వేదికల ద్వారానే ప్రేక్షకుల ముందుకొచ్చాయి. వాటిలో అగ్రతారల సినిమాలు చాలా తక్కువే. ఈ ఏడాది రెండో దశ కరోనా పెద్ద చిత్రాలపై తీవ్రంగానే ప్రభావం చూపించింది. థియేటర్లు తెరచుకున్నా ప్రేక్షకులు వస్తారో? రారో? అన్న భయాలు.. మరోవైపు ఏపీలో టిక్కెట్ రేట్ల సమస్యలతో పలువురు స్టార్ హీరోలు ఓటీటీ బాట పట్టారు. బాక్సాఫీస్ ముందు వినిపించాల్సిన హిట్టు మాటను.. డిజిటల్ వేదికల ద్వారా వినిపించారు. ఇక కొన్ని చిత్రాలు థియేటర్లలో విడుదలై, విజయం సాధించాయి. మరికొన్ని నిరాశపరిచాయి.

థియేట్రికల్.. కమ్ బ్యాక్..
సంక్రాంతి సీజన్లో రిలీజైన క్రాక్ మూవీతో మాస్ రాజా పవర్ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఈ చిత్రం అనూహ్య రీతిలో విజయాన్ని అందుకుంది. తర్వాత విడుదలైన నరేశ్ 'నాంది' సుడిగాడు తర్వాత మళ్లీ ఆ స్థాయిలో విజయాన్ని అందుకునేలా చేసింది. ఫిబ్రవరిలో విడుదలైన 'నాంది' ఇయర్స్ బిగ్గెస్ట్ హిట్స్లో ఒకటిగా నిలిచింది. లౌక్యం తర్వాత సరైన హిట్టు లేని గోపీచంద్. 'సీటిమార్' కమ్ బ్యాక్ ఇచ్చాడు. అలాగే 'హలో, మిస్టర్ మజ్ను' లాంటి చిత్రాలు చేసినప్పటికీ ఫస్ట్ హిట్ మాత్రం దక్కలేదు. అయితే 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్' ఈ హీరోకి మెమొరబుల్ హిట్గా నిలిచింది. 'అఖండ'తో సెకండ్ వేవ్ తర్వాత టాలీవుడ్కు బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అందించాడు బాలయ్య. దాదాపు నాలుగేళ్ల తర్వాత బంపర్ హిట్ కొట్టాడు.
లాభాలు తెచ్చిపెట్టిన ఓటీటీ..
ఓటీటీ వేదిక విడుదలై, అనేక సినిమాలు టాలీవుడ్కి లాభాలు తెచ్చిపెట్టాయి. ఇదే బాటలో 'సినిమా బండి, ఏక్ మినీ కథ, వివాహ భోజనంబు, ఆకాశవాణి, సూపర్ ఓవర్, జగమేతంత్రం, థ్యాంక్యూ బ్రదర్, జై భీమ్' వంటి చిత్రాలు ఓటీటీలో విడుదలై, మంచి విజయాల్ని సాధించాయి. అంతేకాకుండా నిర్మాతలకు లాభాల్ని కూడా తెచ్చిపెట్టాయి. తాజా పరిణామాల నేపథ్యంలో చాలామంది టాప్ స్టార్స్ తమ సినిమాలను నిర్మాణ దశలోనే ఓటీటీ ప్లాట్ ఫామ్లకు అమ్మేయాలని డీల్స్ మాట్లాడుకుంటున్నారు. కోవిడ్ తెచ్చిన ఈ మార్పు కారణంగా ఓటీటీల వల్ల టాలీవుడ్తో పాటు ఇండియన్ సినిమా లాభపడిందే కానీ ఎక్కడా నష్టాలని చవిచూడకపోవడం గమనార్హం.
డబుల్ ధమాకా..
ఈ ఏడాది ఓటీటీ వేదికగా జోరు చూపించారు కథానాయకుడు వెంకటేష్. 'నారప్ప', 'దృశ్యం-2' చిత్రాలతో ఓటీటీ వేదికగా డబుల్ ట్రీట్ ఇచ్చారు. 'అసురన్' కు రీమేక్గా శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన 'నారప్ప'.. ఇక 'దృశ్యం 2' తోనూ మరోసారి ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకొచ్చారు వెంకీ. ఈ సినిమాతోనే మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్ తెలుగు తెరకూ పరిచయమయ్యారు. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కింది. 'వి' సినిమాతో గతేడాదే ఓటీటీ వేదికగా సినీప్రియుల్ని పలకరించారు కథానాయకుడు నాని. ఆ తర్వాత ఆయన నటించిన చిత్రమే 'టక్ జగదీష్'. థియేటర్లు లక్ష్యంగానే రూపొందించిన సినిమా అయినా.. కోవిడ్ పరిస్థితుల వల్ల ఆఖరి నిమిషంలో ఓటీటీలో విడుదలైంది. ఈ ఏడాది వరుసగా 'చెక్', 'రంగ్ దే' సినిమాలతో బాక్సాఫీస్ ముందు సందడి చేశారు కథానాయకుడు నితిన్. అలాగే 'మాస్ట్రో'తో ఓటీటీ వేదికపైనా కాలుమోపారు.
అలరించిన అనువాదాలు..
ఈ ఏడాది ఓటీటీ వేదికల్లో అనువాద చిత్రాల జోరు బాగానే కనిపించింది. వాటిలో అందరి దృష్టినీ ఆకర్షించినవి తమిళ సినిమాలు 'సార్పట్ట', 'జైభీమ్'. ఈ రెండూ ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్లోనే విడుదలయ్యాయి. ఎమర్జెన్సీ రోజుల్లో చెన్నరు నేపథ్యంగా సాగే కథతో రూపొందించారు. బాక్సింగ్ ఆట చుట్టూ అల్లుకున్న కథకు సామాజిక సమస్యల్ని మేళవిస్తూ రంజిత్ చేసిన ఈ సినిమాకి ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. ఇక సూర్య నటించిన 'జైభీమ్' సినిమా దేశవ్యాప్తంగా ఓ సంచలనాన్నే సృష్టించింది. పోలీసుల వల్ల అన్యాయానికి గురైన ఓ ఆదివాసీ కుటుంబం కోసం.. చంద్రు అనే ఓ న్యాయవాది చేసిన స్ఫూర్తిదాయక పోరాటమే ఈ చిత్ర ఇతివృత్తం. బాధిత ఆదివాసీలుగా రాజన్న, సినతల్లి పాత్రల్లో మణికందన్, లిజోమోల్ జోసేలు జీవించిన విధానం సినీప్రియులపై చెరగని ముద్ర వేశాయి. ఇదే కోవలో.. అండ్రాయిడ్ కట్టప్ప వెర్షన్ 5.25, జల్లికట్టు, బెల్బోటమ్, ఫోరెన్సిక్, శక్తి, సూపర్ డీలక్స్, 96, భుజ్ తదితర చిత్రాలు అలరించాయి.
చివరి వారంలో...
ఇక డిసెంబర్లో 'అఖండ', 'పుష్ప' ఇచ్చిన జోష్తో బాక్సాఫీస్ వద్ద సినిమాల సందడి కొనసాగుతోంది. కోవిడ్కు ముందున్న పరిస్థితులు కనపడుతున్నాయి. ఇప్పుడు మా వంతు అంటూ ఈ క్రిస్మస్కు కొన్ని సినిమాలు సందడి చేయడానికి రెడీ అయ్యాయి.
'ది మ్యాట్రిక్' : యాక్షన్ ప్రియులను విశేషంగా అలరించిన సిరీస్ ఇది. 1999లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. దాదాపు 13 ఏళ్ల తర్వాత ఈ సిరీస్లో వస్తున్న చిత్రం 'ది మ్యాట్రిక్స్ రీసర్కషన్స్'. లానా వచౌస్కీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా డిసెంబరు 22న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
నాని 'శ్యామ్ సింగరాయ్' : నాని కథానాయకుడిగా పవర్ఫుల్ కథాంశంతో తెరకెక్కిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ 'శ్యామ్ సింగరారు'. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించారు. సాయి పల్లవి, కృతిశెట్టి కథానాయికలు. డిసెంబరు 24న థియేటర్లలో విడుదల కానుంది.
రణ్వీర్ సింగ్ '83' : భారతీయ క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ టోర్నమెంట్ 1983 ప్రుడెన్షియల్ కప్. ఏమాత్రం అంచనాల్లేకుండా ప్రపంచకప్ టోర్నీలో అడుగుపెట్టిన కపిల్సేన ఫైనల్లో చిరస్మరణీయ విజయం సాధించి, ప్రతి భారతీయుడు గర్వపడేలా చేసింది. ఆ మధుర స్మృతులను వెండితెరపై ఆవిష్కరించే ప్రయత్నమే '83'. కబీర్ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రణ్వీర్ సింగ్ కపిల్దేవ్ పాత్రను పోషించారు. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చి, ఎట్టకేలకు డిసెంబరు 24న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇకపోతే సప్తగిరి 'గూడు పుఠాణి' డిసెంబరు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. రఘు కుంచె ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. పూర్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన చిత్రం 'బ్యాక్డోర్'. ఈ చిత్రం డిసెంబర్ 25న విడుదలకానుంది. యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన హైదరాబాద్ గ్యాంగ్రేప్ను ఆధారంగా చేసుకుని తెరకెక్కిన చిత్రం 'ఆశ ఎన్కౌంటర్'. ఇది డిసెంబరు 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆర్జీవీ సమర్పణలో అనురాగ్ కంచర్ల ఈ చిత్రాన్ని నిర్మించారు. వెబ్ కెమెరాతో తీసిన చిత్రం 'డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు'. అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ జంటగా నటిస్తున్నారు. డిసెంబర్ 24న ప్రముఖ ఓటీటీ వేదిక 'సోనీ లివ్'లో విడుదల కానుంది. 'తొలిసారి తెలుగులో వస్తున్న కంప్యూటర్ స్క్రీన్ బేస్డ్ మూవీ ఇది'.
మలయాళ నటుడు టోవినో థామస్ కథానాయకుడిగా బసిల్ జోసెఫ్ తెరకెక్కి స్తున్న సూపర్హీరో అడ్వెంచర్ ఫిల్మ్ 'మిన్నల్ మురళి'. మలయాళంతో పాటు, తెలుగు, తమిళ, కన్నడ, హిందీల్లో ప్రముఖ ఓటీటీ నెట్ఫ్లిక్స్ వేదికగా ఇది విడుదల కానుంది. డిసెంబరు 24న నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ ్కానుంది. బాలీవుడ్ నటుడు అక్షరుకుమార్, కోలీవుడ్ నటుడు ధనుష్ కలిసి నటిస్తున్న చిత్రం 'అతరంగీ రే'. 'డిస్నీ ప్లస్ హాట్స్టార్' వేదికగా డిసెంబరు 24 నుంచి స్ట్రీమింగ్ కానుంది. శింబు ప్రధానపాత్రలో నటించిన చిత్రం 'మానాడు'. తెలుగులోనూ 'లూప్' పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డిసెంబరు 24న ప్రముఖ ఓటీటీ సోనీలివ్లో స్ట్రీమింగ్ కానుంది.
విజయాలు సాధించిన చిత్రాలు..



క్రాక్, ఉప్పెన, జాతిరత్నాలు, నాంది, వకీల్ సాబ్, లవ్ స్టోరీ, బ్యాచ్లర్, జాంబిరెడ్డి, అఖండ, పుష్ప, పెళ్లిసందడి, రిపబ్లిక్, తిమ్మరుసు, ఏక్ మినీకథ, ఇట్లు అమ్మ శ్రీకారం, రెడ్, రాజ..రాజ..చోర, ఎస్ఆర్ కల్యాణమండపం రరరరరరచిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాయి.
నిరాశపరిచిన సినిమాలు..




'మహాసముద్రం, గాలి సంపత్, చెక్, బంగారు బుల్లోడు, కపటధారి, మోసగాళ్లు, శశి, చావుకబురు చల్లగా, ఎ1 ఎక్స్ప్రెస్, కొండపొలం, వైల్డ్ డాగ్, లక్ష్య, అనుభవించు రాజా, ఇచ్చట వాహనాలు నిలుపరాదు, ఆరడుగుల బుల్లెట్' వంటి చిత్రాలు నిరాశపరిచాయి.