
మనదేశ తొలి ఉపాధ్యాయినిగా సావిత్రి బాయి పూలే అని అందరికి తెలుసు. కానీ ఆమెతో కలిసి పనిచేసి బాలికా విద్యకి కషి చేసిన మరో మహిళ ఉన్నారు. ఆమే ఫాతిమా బేగం. ఆమె ఆధునిక భారత తొలి ముస్లిం ఉపాధ్యాయినిగా పేరు పొందారు. నిన్న మొన్నటి వరకు మనకు ఆమె గురించి పెద్దగా సమాచారం తెలియదు. కానీ ప్రముఖ రచయిత సయ్యద్ నశీర్ అహ్మద్ ఫాతిమా గురించి పరిశోధించి కొంత సమాచారాన్ని మనకు ఒక పుస్తక రూపంలో ఇవ్వగలిగారు. వారి ప్రయత్నం అభినందనీయం.
1850వ ప్రాంతంలో పూలే దంపతులు మనదేశంలో బాలికా విద్యకి పునాదులు వేశారు. అయితే వారి పనులకు ఆనాటి సమాజం నుంచి తగినంత మద్దతు లభించలేదు. జ్యోతిరావు పూలే తండ్రి గోవిందరావు పూలేపై సంస్కరణలకి ఇష్టపడని వారు పూలే దంపతులను ఇంటినుంచి బయటికి పంపమని ఒత్తిడి చేశారు. వారి ఒత్తిడి భరించలేక పూలే దంపతులని ఆయన బయటికి పంపారు. ఆ సమయంలో పూలే దంపతులకు ఉస్మాన్ షేక్, ఆయన సోదరి ఫాతిమా ఆశ్రయం కల్పించారు. అంటే ఫాతిమా లేకుంటే పూలే దంపతుల సేవలు పరిపూర్ణం కావు. 1856లో సావిత్రి బాయి అనారోగ్యం కారణంగా చాలా రోజులు పుట్టింట్లో గడపాల్సి వచ్చింది. ఆ సమయంలో ఫాతిమా పాఠశాలల నిర్వహణ బాధ్యతను తీసుకొంది. 1956 అక్టోబర్ 10న సావిత్రి తన భర్తకు రాసిన లేఖలో ఫాతిమా గురించి రాశారు. ఫాతిమా చరిత్రకు ఈ లేఖే ప్రాణం పోసింది.
ఆనాటి సమాజంలో బహుజనులకు చదువుకోవడానికి అవకాశమే ఉండేది కాదు. ఇక స్త్రీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారి హక్కులని కాలరాసిన రోజులవి. సమాజం నుంచి మద్దతు లేకపోయినా, ఉపాధ్యాయినుల కొరత ఉన్నా, సావిత్రీ, ఫాతిమా బాలికల విద్యకి చేసిన పోరాటం చాలా గొప్పది.
ఈ పుస్తకంలో రచయిత అవసరమైన ప్రతిచోటా తగిన చారిత్రక ఆధారాలతో సహా ఎన్నో కొత్త విషయాలు మన ముందుంచారు. శకలాలుగా ఉన్న ఫాతిమా చరిత్రని వెతికి ఒక వరుస క్రమంలో పెట్టి పాఠకులకి అందించారు. 170 సంవత్సరాల క్రితమే మనదేశంలో ముస్లింలు, బహుజనులు ఐక్యంగా తమ హక్కుల కోసం పోరాడారు అనే విషయం మనకి రచయిత ద్వారా తెలుస్తోంది. ఫాతిమాకి చరిత్రలో జరిగిన అన్యాయాన్ని సరిచేయాల్సి ఉంది. ఆమె గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే సయ్యద్ నశీర్ అహ్మద్ రాసిన ఆధునిక భారత తొలి ముస్లిం ఉపాధ్యాయిని ఫాతిమా షేక్ పుస్తకం చదవాల్సిందే. 72 పేజీల ఈ చిన్ని పుస్తకం వెల రూ. 50. ప్రతుల కోసం సయ్యద్ నశీర్ అహ్మద్, ఫోన్: 94402 41727ను సంప్రదించవచ్చు.
- ఎం.రామ్ ప్రదీప్
94927 12836