- సబ్సిడీ వేరుశనగ రైతులకు అందించడంలో విఫలమవుతున్న వ్యవసాయ సిబ్బంది
ప్రజాశక్తి-ఆత్మకూరు : మండల వ్యాప్తంగా ఇటీవల ఓ మోస్తారు వర్షాలు కురిసాయి. ఇప్పటికే రైతులందరూ పొలాలను సాగు చేసేందుకు సిద్ధం చేసుకున్నారు. మొన్న కురిసిన వర్షాలకు కొంతమంది రైతులు విత్తన సాగు కూడా చేశారు. వర్షాలు కురుస్తాయని ఆశతో చాలామంది రైతులు వేరుశనగ సాగుపై ఆసక్తి పెంచుకున్నారు. సబ్సిడీ వేరుశనగ కావాలని రైతు భరోసా కేంద్రాల్లో రైతులు అడిగితే "నో స్టాక్" అని చెబుతున్నారు. ఇప్పటికే మండలంలో వేరుశనగ బస్తాలకు పలువురు రైతులు నగదు కూడా చెల్లించారు. కానీ వేరుశెనగ బస్తాలు తెప్పించడంలో మండల వ్యవసాయ సిబ్బంది నిర్లక్ష్య ధోరణిగా వ్యవహరిస్తున్నారు. దాదాపు 500 వరకు మండలానికి వేరుశనగ అవసరం ఉంది. కానీ వేరుశనగ అందించడంలో మాత్రం వ్యవసాయ అధికారులు మొగ్గు చూపడం లేదు. ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సొంత మండలంలోని వ్యవసాయ సిబ్బంది ఇంత నిర్లక్ష్యం వ్యవహరిస్తే ఎలా అని రైతులు ఆరోపిస్తున్నారు.










