
ప్రజాశక్తి - చిలకలూరిపేట : చిలకలూరిపేటలో సిఐ పోస్టులకు కొత్తవారిని నియమించనున్నారు. అయితే ఎన్నికలు సమీపిస్తుండడం, మంత్రి ప్రాతినిధ్యం వహిస్తుండడం, ప్రతిపక్షంలోనూ మాజీ మంత్రి ఉండడం రాజకీయంగా ఒత్తిళ్లు ఎదురుకానున్నాయి. ఈ క్రమంలో సిఐ స్థానంలో ఉన్నవారు పక్షపాతం లేకుండా, నిబద్ధతతో పని చేయాలంటే కత్తిమీద సాములా మారింది. ఇప్పటికే పని చేసిన వారు విమర్శలను ఎదుర్కోవడంతోపాటు అధికారిక చర్యలకూ గురయ్యారు. అయితే వీరంతా గతంలో ఉన్నతాధికారులు ప్రశంసలు పొందినవారే. వీటికితోడు ట్రాఫిక్ సమస్యలు, చోరీలు, బెదిరింపులు వంటివి పోలీసు అధికారులకు సవాలుగా నిలుస్తున్నాయి.
ప్రస్తుత మంత్రి, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ, పక్క నియోజకర్గంలోని ఎమ్మెల్యే, ప్రముఖ పారిశ్రామిక వేత్తల నివాసాలు చిలకలూరిపేట పట్టణంలోనే ఉన్నాయి. పట్టణంలో నుండే జాతీయ రహదారి ఉంది. ఇటీవల స్తానిక ఇండియన్ బ్యాంక్ వద్ద కారు అద్దాలు పగులకొట్టి రూ.5 లక్షలు చోరీ జరిగింది. బార్లలో చోరీలు జరుగుతున్నాయి. పట్టణంతోపాటు పరిసర ప్రాంతాల్లోనూ గంజాయి వినియోగం పెరిగినట్లు తెలుస్తోంది. మైనింగ్ వివాదాలు నడుస్తున్నాయి. రేషన్ బియ్య అక్రమ రవాణా జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి. నిషేధిత గుట్కా, ఖైనీలు విక్రయాలు జోరుగా నడుస్తున్నాయి. ద్విచక్ర వాహనాలు తరచూ చోరీకి గురవుతున్నాయి. వీటన్నింటినీ నియంత్రంచిడంతోపాటు రాజకీయంగా ఒత్తిళ్లకు లొంగకుండా పోలీసు అధికారులు విధులు నిర్వహిస్తారా? లేదా? అనేది నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. నెల్లూరు జిల్లా నవాబ్పేట రూరల్ సిఐగా పని చేస్తున్న బి.అశోక్ కుమార్ను చిలకలూరిపేట రూరల్ సిఐగా నియమించినట్లు తెలిసింది.