Nov 07,2021 13:03

సాంప్రదాయ నృత్యంపై ప్రధాన కథాంశాలతో తెలుగు తెరపై సినిమాలొచ్చి చాలా ఏళ్లు అవుతోంది. నాట్యకళ ఔన్నత్యాన్ని చాటుతూ 'సాగర సంగమం, స్వర్ణకమలం, ఆనందభైరవి' వంటి సినిమాలు అభిమానుల మన్ననలు పొందాయి. ప్రేక్షకుల అభిరుచుల్లో మార్పులు రావడం, కళాత్మక సినిమాల్ని తెరకెక్కించే దర్శకుల సంఖ్య తగ్గడంతో నృత్యకళ నేపథ్య చిత్రాల సంఖ్య తగ్గింది. చాలాకాలం తర్వాత కూచిపూడి డ్యాన్సర్‌ సంధ్యారాజు ప్రధానపాత్రలో నటించిన చిత్రం 'నాట్యం'. అగ్రనటులు చిత్రానికి అండగా నిలవడంతో భారీ అంచనాలు పెరిగాయి. అలాంటి ఈ చిత్రం ప్రేక్షకుల్ని మెప్పించిందా? లేదా? తెలుసుకుందాం..!

నటీనటులు : సంధ్యారాజు, కమల్‌ కామరాజు, రోహిత్‌ బెహల్‌, ఆదిత్య మీనన్‌, శుభలేఖ సుధాకర్‌, భానుప్రియ, బేబీ దీవన తదితరులు
సంగీతం : శ్రవణ్‌ భరద్వాజ్‌
నిర్మాతలు : నిశ్రింకళ ఫిల్మ్స్‌
దర్శకుడు : రేవంత్‌ కోరుకొండ
(కథ, సినిమాటోగ్రఫీి, ఎడిటింగ్‌)
రిలీజ్‌ డేట్‌ : 2021-10-22

థలోకి వెళ్తే... స్వాతంత్య్రానికి పూర్వం నుంచి సాంప్రదాయ నృత్య కళలకు 'నాట్యం' అనే గ్రామం ప్రసిద్ధి. అయితే భారతీయ సంస్కృతులు, సంప్రదాయాలను నాశనం చేయాలనే సంకల్పంతో బ్రిటిష్‌ పాలకులు ఆ ఊరిలోని నాట్యశాస్త్ర గ్రంథాలను తగలబెడతారు. నాట్యకళను బతికించాలని ప్రయత్నించిన కాదంబరి అనే యువతిని చంపేస్తారు. సితార (సంధ్యారాజు) చిన్నతనంలోనే అద్భుత నర్తకి 'కాదంబరి కథ' గురించి వింటుంది. ఆ కథ పై ఆసక్తితో గురువు (ఆదిత్య మీనన్‌), ఆయన కుమారుడు హరి (కమల్‌ కామరాజ్‌) పర్యవేక్షణలో నాట్యం నేర్చుకుంటుంది. తన నాట్య రంగప్రవేశంలో 'కాదంబరి కథ'ను ప్రజలకు చెప్పాలనే గురువు కలను నెరవేర్చాలని తపనపడుతుంది. కానీ ఆ కథను చెప్పాలని ప్రయత్నించిన వారందరూ మరణిస్తుంటారు. సితార ప్రాణాలు పోతాయనే భయంతో గురువు ఆమెను వారిస్తాడు. కానీ సితార మాత్రం పట్టుదలగా ప్రయత్నిస్తుంటుంది. అయితే గ్రామపెద్ద (శుభలేఖ సుధాకర్‌) కుట్ర వల్ల ఆ గ్రామం నుంచి హైదరాబాద్‌కు రోహిత్‌ (రోహిత్‌ బెహల్‌) సహాయంతో పారిపోతుంది. రోహిత్‌ సహకారంతో 'కాదంబరి కథ'ను సితార చెప్పగలిగిందా? గురువు లక్ష్యాన్ని నెరవేర్చిందా? అసలు కాదంబరి ఎవరు? ఆమె ప్రాణత్యాగం వెనకున్న రహస్యమేమిటి? నాట్యకళ ద్వారా ఆ ఊరి ప్రజల్లో పేరుకుపోయిన మూఢనమ్మకాన్ని సితార ఎలా చెరిపేసిందన్నదే మిగతా కథ.
    నాట్యం అంటే కాళ్లు, చేతులను ఆడించడం కాదు. గొప్ప కథలను చెప్పే శక్తి నాట్యానికి ఉందనే పాయింట్‌తో రూపొందిన చిత్రమిది. చరిత్రలో మరుగునపడిన ఓ నృత్యకళాకారిణి త్యాగాన్ని, ఆమె ప్రేమకథను నాట్యం ద్వారా ప్రపంచానికి ఓ యువజంట ఎలా తెలియజేసిందనే కథాంశంతో దర్శకుడు రేవంత్‌ కోరుకొండ ఈ సినిమాను తెరకెక్కించారు. సంప్రదాయం, వెస్ట్రన్‌ కళారూపం ఏదైనా వాటి ఆత్మ ఒక్కటేనని చూపించారు. అయితే బ్రిటీష్‌ చరిత్రకు నేటి కాలాన్ని ముడిపెడుతూ కథను బాగా రాసుకున్నారు దర్శకుడు. కాకపోతే ఆ పాయింట్‌ను ఆసక్తికరంగా చెప్పడంలో మాత్రం కొంత కన్ఫ్యూజన్‌కు లోనయ్యారు. పతాక ఘట్టాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కాదంబరి ఎపిసోడ్‌ అలరిస్తుంది. సెట్స్‌పై ఆధారపడకుండా రియల్‌ లొకేషన్స్‌లో సినిమాను తెరకెక్కించడం సహజత్వాన్ని తీసుకొచ్చింది.
    కథను ఇంత నిదానంగా చెబుతున్నారనే ఫీలింగ్‌ వచ్చేసరికి ఓ మంచి ట్విస్ట్‌తో ఫస్టాఫ్‌ ముగించడమే కాకుండా, సెకాండఫ్‌పై ఆసక్తిని పెంచేలా చేస్తుంది. ఇక సెకండాఫ్‌లో సాగే కథ, కథనాలు కాస్త అసలు కథను పక్కకు నెట్టాయనిపిస్తుంది. అయితే ప్రీ క్లైమాక్స్‌ నుంచి ముగింపు వరకూ కథ, కథనాల్లో మంచి హైప్‌ కనిపిస్తుంది. ఎమోషనల్‌ డ్రామా రక్తికట్టడంతో కథలో లీనం అవ్వడానికి దోహదపడుతుంది. చివరి 20 నిమిషాలు ఈ సినిమాకు హైలెట్‌గా మారుతుంది. లవ్‌స్టోరీ, థ్రిల్లర్‌ సినిమాలకు అలవాటుపడిపోయిన తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచే చిత్రమిది. కమర్షియల్‌ అంశాలు, మార్కెట్‌ లెక్కల గురించి ఆలోచించకుండా నాట్యకళ విశిష్టతను గురించి చెప్పాలనే చిత్రబృందం తపన అభినందనీయం.
    ప్రధాన పాత్రలో నటించిన ప్రముఖ నర్తకి సంధ్యారాజు తన క్లాసికల్‌ డ్యాన్స్‌తో పాటు, యాక్టింగ్‌ పరంగానూ ఆకట్టుకుంది. సితార పాత్రకు న్యాయం చేసింది. హీరో పాత్రలో నటించిన రోహిత్‌ బెహల్‌ ఆకట్టుకున్నాడు. సెటిల్డ్‌ పెర్ఫార్మెన్స్‌తో ఫ్రెష్‌గా అనిపించాడు. ఆదిత్య మీనన్‌, శుభలేఖ సుధాకర్‌ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. సాంప్రదాయ, ఫోక్‌, వెస్ట్రన్‌ శైలిలను మేళవిస్తూ శ్రవణ్‌ భరద్వాజ్‌ అందించిన సంగీతం బాగుంది. ముఖ్యంగా రీరికార్డింగ్‌ ప్రత్యేక ఆకర్షణ. రేవంత్‌ కోరుకొండ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. అద్భుతమైన లొకేషన్లు ఫీల్‌ గుడ్‌ ఫ్యాక్టర్స్‌గా మారాయి. ఎడిటింగ్‌ పరంగా రేవంత్‌ మరింత దృష్టి పెట్టి ఉండాల్సింది. అలాగే సినిమాకు క్యాస్ట్యూమ్స్‌ మరింత శోభను తెచ్చిపెట్టాయి. అందుకు సంధ్యారాజును అభినందించాల్సిందే.