
ప్రజాశక్తి-నర్సీపట్నం టౌన్: గత 8 మాసాలుగా అనేక మలుపులు తిరిగిన నర్సీపట్నం ప్రధాన రోడ్డు విస్తరణ పనులు బుధవారం ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ డ్రైనేజీ పనులకు బుధవారం భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో ప్రధాన రోడ్డు 120 అడుగుల వెడల్పు చేయాలని నిర్ణయించారన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత 120 అడుగులైతే భవన యజమానులు భారీగా నష్టపోతారని భావించి, దానిని 100 అడుగులకు కుదించి మున్సిపాలిటీలో తీర్మానం చేశామన్నారు. సుమారు 200 మంది భవన యజమానులుండగా వారిలో 110 మంది 100 అడుగులైతే భారీగా నష్టపోతామని, 90 అడుగులకు కుదించితే టిడిఆర్ బాండ్లు తీసుకోవడానికి సిద్ధమని తెలియజేసి ఒప్పుకోలు పత్రాలు ఇచ్చారన్నారు. వారిని దృష్టిలో పెట్టుకొని 90 అడుగుల వెడల్పుకు పనులు ప్రారంభిం చామన్నారు. 91 మంది కోర్టుకు వెళ్లారని, వారికి నష్టపరిహారం చెల్లించి రోడ్డు పనులు పూర్తి చేస్తామన్నారు. స్థానిక వెంకటేశ్వర స్వామి గుడి నుండి పెద్ద బొడ్డేపల్లి వరకు రోడ్డు వెడల్పుకు రూ. 6 కోట్లు మంజూర య్యాయని, వారం రోజుల్లో టెండర్ ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని మంచి కార్యక్రమాన్ని ప్రారంభించామని, దీనికి వ్యాపారస్తులు, ఇతర వర్గాలు, పార్టీల వారంతా సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి, వైస్ చైర్మన్ కోనేటి రామకృష్ణ, ఎంపీపీ సుర్ల రాజేశ్వరి, గొలుగొండ జడ్పిటిసి సుర్ల వెంకటగిరిబాబు, మున్సిపాలిటీ వైసిపి అధ్యక్షుడు యాకా శివ, రూరల్ మండలా ధ్యక్షుడు ఎస్వివి సత్యనారాయణ, సీనియర్ వైసీపీ నాయకులు డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ లక్ష్మీకాంత్, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ గుడబండి ఆదిలక్ష్మి, కౌన్సిలర్ వీరమాచినేని జగదీశ్వరి, కార్పొరేషన్ డైరెక్టర్ చోటి, సచివాలయాల కోఆర్డినేటర్ తమరాన శ్రీను, కో ఆప్షన్ సభ్యులు, నాలుగు మండలాల నాయకులు, పట్టణ సీఐ నమ్మి గణేష్, మున్సిపల్ అధికారులు, పాల్గొన్నారు.