Nov 09,2023 00:45

స్వాధీనం చేసుకున్న మందులతో అధికారులు

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : మార్కెట్‌లో విరివిగా అమ్ముడు పోతున్న పురుగు మందులను పోలిన నకిలీ బ్రాండ్లను మార్కెట్‌లో విక్రయిస్తుండగా బుధవారం పల్నాడు జిల్లా మాచవరం మండలం మోర్జంపాడు వద్ద విజిలెన్సు అధికారులు బుధవారం దాడి చేసి రూ.56 వేల సరుకును పట్టుకున్నారు. బిలేవియా అనే బ్రాండ్‌ పేరుతో దాన్ని పోలిన నకిలీ బ్రాండ్‌తో నకిలీ పురుగు మందులు తయారు చేసి అమ్ముతూ రైతులను మోసగిస్తున్నట్లు గుర్తించినట్టు విజిలెన్సు అధికారులు తెలిపారు. మోర్జంపాడులోని వేంకటేశ్వర ఫెర్టిలైజర్స్‌ షాప్‌లో తనిఖీలు చేయగా మంచాల చంద్రశేఖరరెడ్డి ఫుడ్‌ మిషనరీ కార్పొరేషన్‌కు చెందిన బిలేవియా అనే పేరు గల పురుగు మందుకు, నకిలీ పురుగు మందు తయారు చేసి అమ్ముతున్నట్టు గుర్తించారు. మిర్చి పైర్లకు తెగుళ్ల నివారణకు ఈ మందు వినియోగిస్తారు. గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ఏటా 50 వేల లీటర్లు విక్రయిస్తున్నారు. గ్రామానికి చెందిన బాసం గోపీరెడ్డి ఈ మందులను బిల్లులు, ఇన్వాయిస్‌లు లేకుండా సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు. గతంలో ఒక పురుగుమందుల కంపెనీలో పనిచేసిన స్వల్ప అనుభవంతో నకిలీ మందులు తయారు చేస్తున్నట్టు తెలిపారు. ఈ మందు ఎక్కడ తయారు అవుతుంది? ఎవరెవరు అమ్ముతున్నారు? అనేది విచారణ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. దుకాణంలోని రూ.56,160 విలువ కలిగిన 240 మిల్లీ లీటర్లతో కూడిన 20 బాటిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో వ్యవసాయ శాఖాధికారి రమణకుమార్‌, ఎస్‌ఐ రామచంద్రయ్య పాల్గొన్నారు.