Oct 04,2023 21:06

మాట్లాడుతున్న కమిషనర్‌

మాట్లాడుతున్న కమిషనర్‌
నిరాశ్రయులకు నూతన కేంద్రాలను ఏర్పాటు

ప్రజాశక్తి-నెల్లూరు:నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో స్థానిక పాత మున్సిపల్‌ కార్యాలయం ప్రాంగణంలో నిరాశ్రయులకోసం నిర్వహిస్తున్న కేంద్రానికి అదనంగా మరో రెండు నూతన కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులను కమిషనర్‌ వికాస్‌ మర్మత్‌ ఆదేశించారు. కొండాయపాలెం బిసి వసతి గహం ప్రాంగణం, ఏ.బి.ఎమ్‌ ప్రాంగణాలను కమిషనర్‌ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాత మున్సిపల్‌ కార్యాలయంలో నిరాశ్రయుల సంఖ్య పెరుగుతున్న కారణంగా నూతన వసతి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. సంబంధిత నిర్వాహకులతో మాట్లాడి, నగరంలోని నిరాశ్రయులకు ఆయా కేంద్రాల్లో వసతి కల్పించేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను కమిషనర్‌ సూచించారు.
అనంతరం స్థానిక ఎఫ్‌.సి.ఐ కాలనీ, జె.వి.ఆర్‌ కాలనీ, వండ్లూరు కాలనీల్లోని పట్టణ ఆరోగ్య కేంద్రాలను సందర్శించి, జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అమలు తీరును కమిషనర్‌ పర్యవేక్షించారు. ఆరోగ్య కేంద్రానికి వస్తున్న ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు, పరీక్షలు, ఉచితంగా మందులను పంపిణీ చేయాలని సూచించారు. స్థానిక 31/3 శివాజీ నగర్‌,37/1 ఓల్డ్‌ మిలటరీ కాలనీ సచివాలయాన్ని కమిషనర్‌ తనిఖీ చేశారు. సచివాలయం పరిధిలో పన్ను వసూళ్ల లక్ష్యాలను నిర్దేశించిన సమయానికి పూర్తి చేయాలని సూచించారు. విధుల నిర్వహణలో అలసత్వం వహించరాదని, సంక్షేమ పథకాలు, ఇతర సేవలను నిబద్ధతతో అందించాలని కమిషనర్‌ సచివాలయ కార్యదర్శులకు సూచించారు.ఈ కార్యక్రమాల్లో అదనపు కమిషనర్‌ శర్మద, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ వెంకట రమణ, డాక్టర్‌ . జిజీయా బారు,మెడికల్‌ ఆఫీసర్లు ,టి.పి.ఆర్‌.ఓ ప్రసాద్‌, మెప్మా పి.డి రవీంద్ర, ఇంజనీరింగ్‌ విభాగం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.