Oct 26,2023 23:45

ప్రజాశక్తి - చిలకలూరిపేట : ప్రజలందర్నీ నిలువునా మోసం చేసిన వైసిపికి సామాజిక న్యాయ యాత్రలు చేపట్టే నైతిక హక్కు ఎక్కడిదని మాజీమంత్రి పత్తిపాటి పుల్లారావు ప్రశ్నించారు. పట్టణంలోని ఆయన నివాసంలో గురువారం విలేకర్లతో మాట్లాడారు. పేరుకు మాత్రం 'నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు' అని సిఎం అంటున్నారని, ప్రభుత్వం పదవులు దక్కేది, ఆధికారం, ఆధిపత్యం చెలాయించేది మరొకరని అన్నారు. ఎవర్ని మోసం చేయడానికి, మభ్యపెట్టడానికి ఈ దొంగనాటకాలని దుయ్యబట్టారు. అబ్దుల్‌ సలాం కుటుంబం సామూహిక ఆత్మహ్యతకు బాధ్యులు ఎవరో ముందు తేల్చాలని, డ్రైవర్‌ సుబ్రహ్మణ్యాన్ని అన్యాయంగా చంపి డోర్‌ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబును తిరిగి జైలుకు పంపాలని, జగన్‌ను ముఖ్యమంత్రి చేయడం కోసం అన్యాయంగా జైల్లో మగ్గిపోతున్న కోడికత్తి శ్రీనుకు బెయిల్‌ ఇప్పించాలని, 56 బీసీ కార్పొరేషన్లు ద్వారా ఎంతమందికి ఏం మేలు చేశారో చెప్పాలని, ఆ తర్వాతే సామాజిక న్యాయ యాత్రలు చేయాలని అన్నారు. భువనేశ్వరి, లోకేశ్‌ కార్యక్రమాల గురించి అధికార పార్టీలో అంత ఉలుకెందుకన్నారు. చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించారని, 73 ఏళ్ల వయస్సున్న ఆయన్ను జైలులో ఉంచి రాక్షసానందం పొందుతున్నారని విమర్శించారు. చంద్రబాబు ఆరోగ్యం విషయంలో ప్రభుత్వం కుట్ర పన్నుతోందని, హెల్త్‌ బులిటెన్‌లో కూడా నిజాలు దాస్తున్నారని ఆరోపించారు.