బుక్కరాయసముద్రం : జగనన్నకు చెబుదాం అర్జీలను నాణ్యతగా పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన జగనన్నకు చెబుదాం, స్పందన గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి జాయింట్ కలెక్టర్ అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి 56 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో భాగంగా వచ్చిన అర్జీలను పూర్తి నాణ్యతతో పరిష్కరించాలన్నారు. జగనన్నకు చెబుదాం అర్జీలను నాణ్యతగా పరిష్కరించేందుకు డివిజన్, మండల స్థాయిలో అధికారులకు శిక్షణ ఇవ్వాలన్నారు. జగనన్నకు చెబుదాం అర్జీలను వ్యక్తిగతంగా తీసుకుని అర్జీదారుడితో ప్రత్యేకంగా మాట్లాడి నాణ్యమైన పరిష్కారం చూపించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. మండల స్థాయిలోనే అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపిస్తే అర్జీదారులు జిల్లా స్థాయికి రావాల్సిన అవసరం ఉండదన్నారు. గ్రామ, మండల స్థాయిలో పరిష్కరించాల్సినవి అక్కడే పరిష్కరించాలని, ప్రభుత్వ నియమ నిబంధనలను పాటిస్తూ సమస్యలను పరిష్కరించాలని, ఇందుకోసం ప్రత్యేక మెకానిజం రూపొందించుకోవాలన్నారు. మండల స్థాయిలో నిర్వహించే జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి జిల్లా అధికారులు హాజరుకావాలన్నారు. ఎప్పటికప్పుడు ఎలాంటి పెండింగ్ లేకుండా అర్జీలకు పరిష్కారం చూపించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో మధుసూదన్, డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసులు, డీఆర్డీఏ పీడీ నరసింహా రెడ్డి, డ్వామా పీడీ వేణుగోపాల్ రెడ్డి, ఐసిడిఎస్ పీడీ శ్రీదేవి, ఆర్అండ్బి ఎస్ఈ ఓబుల్ రెడ్డి, స్పందన తహసీల్దార్ వాణిశ్రీ తదితరులు పాల్గొన్నారు.










