
ప్రజాశక్తి- విశాఖ కలెక్టరేట్
మునిసిపల్ అవుట్ సోర్సింగ్ (ఆప్కాస్) ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద జివిఎంసి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యాన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కెఎస్వి.కుమార్, యూనియన్ అధ్యక్షుడు టి.నూకరాజు, ప్రధాన కార్యదర్శి యు.రాజు మాట్లాడుతూ, ఆప్కాస్లో చేర్చిన ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేస్తామని వాగ్దానం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దాన్ని నిలుపుకోలేదన్నారు. 2019 ఎన్నికల మేనిఫెస్టో సమయంలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇస్తామని హామీ ఇచ్చారని, దానిని కూడా అమలు చేయలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 123 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో సుమారు 40 వేల మంది కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులు 20 నుంచి 25 ఏళ్లుగా నామమాత్రపు జీతాలతో పని చేస్తున్నారని, వీరికి ఉద్యోగ భద్రత లేదని ఆవేదన వ్యక్తంచేశారు. పేస్కేల్, కరువు భత్యం, ఇంటి అద్దె అలవెన్స్, ఇంక్రిమెంట్లు లేవని పేర్కొన్నారు. 60 సంవత్సరాలు నిండి విరమణ పొందిన కార్మికులకు గ్రాట్యుటీ ఇవ్వటం లేదని, పెన్షన్లు ఉండటం లేదని చెప్పారు. 5, 6 ఏళ్ల కోసారి నామమాత్రంగా జీతాలు పెంచుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జిఒ 114 ప్రకారం 10,117 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేసినా అందులో ఒక్కరు కూడా మున్సిపల్ కార్మికులు లేరని తెలిపారు. అప్కాస్ కార్మికులను రెగ్యులర్ చేయకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ సహాయ కార్యదర్శులు ఎంవి.ప్రసాదరావు, జె.నాయుడు, యుజిడి యూనియన్ అధ్యక్షుడు ఇ.ఆదినారాయణ, కె.కుమారి, క్లాప్ డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షుడు అనిల్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
అనకాపల్లి : మున్సిపల్ పారిశుధ్య అవుట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని కోరుతూ రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా జివిఎంసి అనకాపల్లి జోన్ పరిధిలో శనివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్.శంకరరావు మాట్లాడుతూ కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ కార్మికులందర్నీ పర్మినెంట్ చేస్తానని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీ ఇచ్చి మేనిఫెస్టోలో చేర్చిన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయకపోవడం దారుణమన్నారు. ఇప్పుడు కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తూ ఉత్తర్వులు విడుదల చేశారని, అయితే ఔట్సోర్సింగ్ సిబ్బందిని పర్మనెంట్ చేయకపోవడం అన్యాయమన్నారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు బొమ్మల రాము, సత్యనారాయణ, పోలరావు తదితరులు పాల్గొన్నారు.