కళ్యాణదుర్గం;ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి ఈనెల 8వ తేదీన కళ్యాణదుర్గంలో జరిగే రైతు దినోత్సవ కార్యక్రమానికి విచ్చేస్తున్న సందర్భంగా అందుకు సంబంధించి బహిరంగ సభ ఇతర ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ పనులను గురువారం నాడు రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీచరణ్, కలెక్టర్ ఎం.గౌతమి తదితరులు పరిశీలించారు. హెలీప్యాడ్, కాన్వారు, విఐపి గ్యాలరీలు, ప్రోటోకాల్, సిట్టింగ్, పారిశుధ్యం, విద్యుత్ తదితర ఏర్పాట్లపై సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి తగి దిశానిర్ధేశం చేశారు. ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా జాగ్రత్తగా అన్ని చర్యలూ తీసుకుని విజయవంతం చేయాలని అధికారులకు సూచించారు. హెలిప్యాడ్ వద్ద ముఖ్యమంత్రిని కలిసేందుకు వచ్చే ప్రతినిధులు, ప్రముఖులను గుంపులు గుంపులుగా కాకుండా వరుస క్రమంలో వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. మార్కెట్ యార్డ్లోఉన్న అగ్రి ల్యాబ్ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ ప్రశాంత్ కుమార్, ఆర్డీవో నిశాంత్ రెడ్డి, జడ్పీ సీవో భాస్కర్ రెడ్డి, గుంతకల్ ఆర్డీవో రవీంద్ర, వ్యవసాయ శాఖ జేడి ఉమామహేశ్వరమ్మ, ఐసిడిఎస్ పీడీ శ్రీదేవి, పౌర సరఫరాల శాఖ అధికారి శోభారాణితో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.










