ప్రజాశక్తి-రాయదుర్గం సిఎం జగన్ పర్యటనను అడ్డుకుంటా మని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బి.మల్లికార్జున హెచ్చరించారు. గురువారం పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సామాన్య, బడుగు బలహీన వర్గాల ప్రజలు, రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు, ఔట్సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అలాగే విపరీతంగా పెరిగిన విద్యుత్ ఛార్జీలు, నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు పెరిగాయన్నారు. పోలవరం నిర్వాసిత బాధితులకు, ఔట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేస్తామని, రాష్ట్రంలో పరిశ్రమలను ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ప్రతి ఏడాదీ జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఉపాధి కల్పన కల్పిస్తామనే జగన్ హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా నాలుగేళ్ల తన పాలన పూర్తయినప్పటికీ నేటికీ ఒక్క టిడ్కో ఇంటిని పూరి చేసిన పాపానపోలేదన్నారు. ఆయా సమస్యలు పరిష్కరించిన తర్వాతే సిఎం జగన్ జిల్లాలో అడుగు పెట్టాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకూ సిఎం పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు ఎన్.నాగరాజు, పట్టణ సహాయ కార్యదర్శి జి.మధు, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు శివ, నాయకులు తిమ్మరాజు, అంజి, నాగరాజు, శంకర్, రమేష్, కృష్ణానాయక్, నాగేంద్రనాయక్, బి.ఆంజనేయులు, ఆటో అంజి, తదితరులు పాల్గొన్నారు.
విలేకరులతో మాట్లాడుతున్న సిపిఎం నాయకులు










