ప్రజాశక్తి-అనంతపురం అనంతపురం ఆర్డీటీ క్రీడామైదానంలో ఈనెల 6 నుండి 8వ తేదీ వరకూ జరిగిన పోనీ మినీ సబ్ జూనియర్ జాతీయస్థాయి సాఫ్టుబాల్ పోటీలు ఘనంగా ముగిశాయి. ఇందులో భాగంగా గురువారం హోరాహోరీగా జరిగిన ఫైనల్ పోటీల్లో ఏపీ అండర్-11 బాలురు, అండర్-13 బాలికలు, అండర్-13 బాలుర జట్లు విజయకేతనం ఎగురవేశాయి. ఈ సందర్భంగా బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టిడిపి అధికార ప్రతినిధి పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ అండర్-11, అండర్-13 దశ నుండి క్రీడాకారులుగా ఆడటం ప్రారంభించిన ఈ చిన్నారులు రేపు అంతర్జాతీయ క్రీడాకారులుగా ఎపి నుంచి దేశం గర్వించదగ్గ క్రీడాకారులుగా తయారవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇలాంటి టోర్నమెంట్లు జరగడానికి ఆర్డిటి చేస్తున్న సహాయ సహకారాలు ఎనలేనివన్నారు. సాఫ్ట్బాల్ కోసమే అంకితమై పని చేస్తున్న వెంకటేసులు ను ప్రత్యేకంగా అభినందించారు. వెంకటేసులు మాట్లాడుతూ ఈ టోర్నమెంటులో 12 రాష్ట్రాల బాల, బాలికల జట్లకు సంబంధించి సుమారు 600 మంది క్రీడాకారులు పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం విజేతలైన జట్లకు బహుమతులు చేశారు. అండర్-11 బాలురు ఏపీ మొదటి స్థానం, తెలంగాణ ద్వితీయ స్థానం మధ్యప్రదేశ్ తృతీయ స్థానంలో నిలిచాయి. అండర్ 11 గర్ల్స్ లో మధ్యప్రదేశ్ ప్రథమ స్థానం, ఏపీ ద్వితీయ స్థానం, తెలంగాణ తతీయ స్థానం సాధించాయి. అండర్ 13 బాలుర పోటీల్లో ఏపీ మొదటి స్థానం, మధ్యప్రదేశ్ ద్వితీయ స్థానం, తెలంగాణ తృతీయ స్థానం సాధించాయి. అండర్ 13 గర్ల్స్ పోటీల్లో ఏపీ ప్రథమ స్థానం, మధ్యప్రదేశ్ ద్వితీయ స్థానం, తెలంగాణ తృతీయ స్థానం కైవసం చేసుకున్నాయి. ఈ కార్యక్రమంలో సాఫ్టుబాల్ ఇండియా సీఈఓ ప్రవీణ్ అనౌకర్, ఏపీ సీఈఓ సి.వెంకటేశులు, ట్రెజరర్ శ్రీకాంత్ తొరాట్, రాష్ట్ర కార్యదర్శి సి.నాగేంద్ర, తెలంగాణ సెక్రటరీ శోభన్, టోర్నమెంట్ టెక్నికల్ కమిటీ ప్రెసిడెంట్ దేశ్ పాండే, పీడీలు ప్రభాకర్, గోపాల్రెడ్డి, కేశవమూర్తి, చంద్ర, లతాదేవి, రమేష్, కోచ్లు లక్ష్మి, సింహాద్రి, వరుణ్, మహేష్, జగదీష్, శివాజీ నాయక్, బద్రి, అశోక్, తదితరులు ఉన్నారు.
విజేతలకు బహుమతులు అందజేస్తున్న పరిటాల శ్రీరామ్










