ప్రజాశక్తి-తాడిపత్రి పట్టణంలోని మట్కా నిర్వాహకులపై దాడులు నిర్వహించి 12 మంది నిర్వాహకులను అరెస్టు చేయడంతోపాటు రూ. 10,21,355 నగదును స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ గంగయ్య తెలిపారు. సోమవారం పట్టణంలోని పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన ఆధ్వర్యంలో పట్టణ సీఐ శంకర్రెడ్డి, ఎస్ఐ ధరణిబాబు, ఇంటెలిజెన్స్ విభాగ సిబ్బంది మూడు బృందాలుగా విడిపోయి పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో మెరుపు దాడులు నిర్వహించి విజయనగర్ కాలనీకి చెందిన కక్కరవలి నౌసాద్, శ్రీనివాస పురానికి చెందిన మక్తుమ్ మాబు, టైలర్స్ కాలనీకి చెందిన షేక్ హుస్సేన్బాషా, నందలపాడుకు చెందిన గంజుల లక్ష్మయ్య, భగత్సింగ్ నగర్కు చెందిన శరత్బాబు, నందలపాడుకు చెందిన నూర్ మహమ్మద్వలి, గన్నెవారిపల్లి కాలనీకి చెందిన షేక్ ఇమాముద్దీన్, ఆసుపత్రిపాలెంకు చెందిన హాజీ ముస్తఫా, హరిజనవాడకు చెందిన మేకల పుల్లయ్య, రూరల్ పరిధిలోని తలారి చెరువు గ్రామానికి చెందిన ఉస్మాన్, ఆసుపత్రిపాలెంకు చెందిన ప్రతాప్, పాతకోటకు చెందిన వెంకటరమణను అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితుల నుంచి రూ.10,21,355 నగదు, మట్కా చీటీలు, 12బాల్ పెన్నులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మట్కా నిర్వాహకులు వారి స్వలాభం కోసం అమాయక ప్రజలకు అధిక మొత్తాన్ని ఆశ చూపుతూ సులభంగా దోసుకుంటున్నారన్నారు. ప్రజలు గమనించి మట్కా జోలికి పోవద్దని సూచించారు. ఎవరైనా మట్కా నిర్వహణకు పాల్పడితే సస్పెక్ట్ షీట్, పీడీ యాక్ట్ అమలు చేసి జిల్లా బహిష్కరణ చేస్తామని హెచ్చరించారు.
మట్కా నిర్వాహకుల వివరాలను వెల్లడిస్తున్న డీఎస్పీ గంగయ్య










