Jan 23,2022 12:55

హుషారుగా మొదలు కావాల్సిన కొత్త సినీ క్యాలెండర్‌.. కరోనా పరిస్థితుల వల్ల తలకిందులైంది. పెద్ద చిత్రాలు కూడా ఒక్కొక్కటిగా బాక్సాఫీస్‌ రేసు నుంచి తప్పుకోవడంతో.. చిన్న చిత్రాలు వరుస కట్టాయి. అలా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాల్లో కాస్త అందరి దృష్టినీ ఆకర్షించింది 'అతిథి దేవోభవ'. ఆది సాయికుమార్‌ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని పొలిమేర నాగేశ్వర్‌ తెరకెక్కించారు. నువేక్ష కథానాయిక. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన సినిమా కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. మరి ఆ అంచనాలు అందుకోవడంలో ఏమేర సఫలీకృతులయ్యారో తెలుసుకుందాం..!

చిత్రం: అతిథి దేవోభవ
నటీనటులు : ఆది సాయికుమార్‌, నువేక్ష, రోహిణి, సప్తగిరి, ఆదర్శ్‌ బాలకృష్ణ తదితరులు
సంగీతం: శేఖర్‌ చంద్ర
కూర్పు: కార్తీక్‌ శ్రీనివాస్‌
ఛాయాగ్రహణం: అమర్‌నాథ్‌ బొమ్మిరెడ్డి
దర్శకత్వం: పొలిమేర నాగేశ్వర్‌
నిర్మాతలు: రాజాబాబు మిర్యాల, అశోక్‌ రెడ్డి మిర్యాల
విడుదల తేదీ: 07-01-2022

మోనోఫోబియా కథాంశమే 'అతిథి దేవోభవ'



కథలోకి వెళ్తే.. ఒంటరిగా ఉండటాన్ని చావుతో సమానంగా భావించే కుర్రాడు అభి అలియాస్‌ అభరు (ఆది). అది అతడికి చిన్నప్పటి నుంచి ఉన్న మానసిక సమస్య. వైద్య పరిభాషలో మోనోఫోబియా అంటారు. మోనోఫోబియా అంటే.. మారుతి తీసే సినిమాలలో హీరోలకి ఉండే మతిమరువు, అతి శుభ్రత, అతి భయం వంటిదే. కాకపోతే ఇది కాస్త ప్రమాదకరమైనదన్నమాట. అంటే ఒంటరితనం భరించలేకపోవడం. పక్కన ఎవరైనా లేకపోతే చనిపోవాలని అనిపించడం. అందుకే నలుగురి మధ్య జీవించడానికే ఇష్టపడుతుంటాడు అభరు. తనకున్న ఈ లోపం కారణంగానే ఎంతగానో ప్రేమించిన అమ్మాయిని దూరం చేసుకుంటాడు. ఆ బాధలో ఉన్న సమయంలోనే వైష్ణవి (నువేక్ష) అతని జీవితంలోకి ప్రవేశిస్తుంది. తొలి చూపులోనే ఒకరిపై మరొకరికి ప్రేమ కలుగుతుంది. అయితే తన లోపం గురించి తెలిస్తే ఆమె కూడా దూరమవుతుందనే భయంతో ఆ విషయాన్ని దాచి పెట్టే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో వారి ప్రేమకు ఊహించని సమస్యలు ఎదురవుతాయి. కొన్ని అనుకోని సంఘటనల వల్ల అభిని సైకోగా భావించి, పోలీసులు అరెస్టు చేయాల్సి వస్తుంది. మరి ఆ తర్వాత ఏమైంది? అసలు అభరుకు ఎదురైన సమస్యలేంటి? ఆ చిక్కుల నుంచి అతడెలా బయటపడ్డాడు? తన ప్రేమను ఎలా కాపాడుకున్నాడు? అన్నది తెరపై చూడాలి.
    మనిషికున్న లోపాలను ఆధారం చేసుకొని, తెరకెక్కిన కథలు తెలుగులో చాలానే ఉన్నాయి. ఇలాంటి కథలను వినోదాత్మకంగా వండి వార్చడంలో దర్శకుడు మారుతీది అందె వేసిన చేయి. ఆయన నుంచి వచ్చిన 'భలే భలే మగాడివోరు', 'మహానుభావుడు', 'మంచి రోజులొచ్చాయి' వంటి చిత్రాలన్నీ ఈ తరహా కథాంశాలతో రూపొందినవే. ఒకదాంట్లో మతిమరుపును, మరొకదాంట్లో అతిశుభ్రతను, ఇంకోదాంట్లో అతిభయం.. అనే పాయింట్లను వినోదాత్మకంగా చూపించి, కడుపుబ్బా నవ్వించారు. 'అతిథి దేవోభవ' కూడా ఈ తరహా కథాంశంతో రూపొందిన చిత్రమే. దీంట్లో కొత్తగా కనిపించే అంశం మోనోఫోబియా. ఈ పాయింట్‌ను దర్శకుడు పొలిమేర నాగేశ్వర్‌ కాసేపు థ్రిల్లర్‌ కోణంలోనూ.. ఇంకాసేపు వినోదాత్మక కోణంలోనూ చూపించే ప్రయత్నం చేశారు. ఆరంభంలో అభరు బాల్యాన్ని.. అతని మోనోఫోబియాను పరిచయం చేస్తూ వచ్చే సన్నివేశాలు ఆసక్తికరంగానే అనిపిస్తాయి. కానీ, అక్కడి నుంచి ప్రేక్షకులకు వినోదంతో కూడిన థ్రిల్‌ పరిచయం చేశాడు దర్శకుడు. వైష్ణవి, అభరు ప్రేమ కథ మొదలయ్యాక కథలో కాస్త వేగం పెరుగుతుంది. విరామానికి ముందు అభరు తన ప్లాట్‌లో ఒంటరిగా ఉండాల్సి రావడం.. దాన్ని తట్టుకోలేక ఆత్మహత్యకు ప్రయత్నించడంతో ద్వితీయార్ధం ఏం జరగబోతుందా? అన్న ఆసక్తి పెరుగుతుంది.
     ప్రధమార్ధంలో కామెడీ థ్రిల్లర్‌గా కథను నడిపే ప్రయత్నం చేసిన దర్శకుడు.. ద్వితీయార్ధంలో కాసేపు దాన్ని సైకో థ్రిల్లర్‌గా చూపించే ప్రయత్నం చేశాడు. అభరును సైకోగా భావించి, పోలీసులు అరెస్ట్‌ చేయడంతో కథ రసవత్తరంగా మారుతుంది. ఆ తర్వాత వచ్చే ఎపిసోడ్‌తో కాస్త నిరాశ పరుస్తుంది. యాక్షన్‌ సీక్వెన్స్‌ మాత్రం ప్రేక్షకులను మెప్పిస్తాయి. దర్శకుడు నాగేశ్వర్‌ కథకు అనుగుణంగా రాసుకున్న సన్నివేశాలను అంతే సిన్సియర్‌గా తెరకెక్కించారు. నటీనటుల నుండి మంచి నటనను రాబట్టాడు.
    అభయ్ పాత్రకు తనవంతు న్యాయం చేశారు హీరో ఆది. డిఫరెంట్‌ వేరియేషన్స్‌లో ఆది సాయికుమార్‌ నటన ఆకట్టుకుంటుంది. ఇంతకుముందు ఆది ఈ తరహా పాత్ర చేయలేదు. సెటిల్డ్‌ పెర్ఫార్మెన్స్‌తో తన మార్క్‌ నటనని ఆది ఇందులో ప్రదర్శించాడు. నువేక్ష తెరపై అందంగా కనిపించింది. నటన పరంగా ప్రతిభ చూపించడానికి పెద్దగా ఆస్కారం దొరకలేదు. ఆది తల్లి పాత్రలో రోహిణి ఎంతో చక్కగా ఒదిగిపోయారు. అలాగే ఎంటర్‌టైన్‌మెంట్‌ పరంగా సప్తగిరి మరోసారి తన మార్క్‌ని ప్రదర్శించాడు. ప్రేక్షకులను కాసేపు కడుపుబ్బా నవ్విస్తాడు. రఘు కారుమంచి, రవిప్రకాశ్‌, ఆదర్శ్‌ బాలకృష్ణ వంటి మిగిలిన నటీనటులందరూ తమకిచ్చిన పాత్రల్లో బాగానే నటించారు. శేఖర్‌ చంద్ర అందించిన సంగీతం సినిమాకి బలాన్నిచ్చింది. 'బాగుంటుంది నువ్వు నవ్వితే', 'నిన్ను చూడగానే', 'చిన్నిబొమ్మ నన్నిలా..' పాటలు ప్రేక్షకులను అలరిస్తాయి. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకునేలా ఉంది. కార్తీక్‌ కత్తెరకు పని చెప్పాల్సింది. అమర్‌నాథ్‌ ఛాయాగ్రహణం ఫర్వాలేదు. 'మోనోఫోబియా'ని సరికొత్తగా ప్రజంట్‌ చేయాలనే విషయంలో దర్శకుడు సక్సెస్‌ అయ్యాడనే చెప్పుకోవచ్చు.