మొక్కలు నాటి సంరక్షించుకోవాలి: కలెక్టర్
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్
చెట్లు నాటడం, వాటిని కాపాడడం వల్ల ఆహ్లాదకరమైన అనుభూతిని పొందడంతో పాటు, ఆరోగ్యవంతంగా ఉండగలమని జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్ అన్నారు. శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ దంపతులు, జాయింట్ కలెక్టర్ దంపతులు చిత్తూరు నగర పాలిక ఆధ్వర్యంలో నగరంలోని గాయత్రీనగర్ కాలనీలో ఏర్పాటు చేస్తున్న పార్కులో చెట్లను నాటారు. నగరపాలక ఆధ్వర్యంలో సుమారు రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్న ఈ పార్క్లో వివిధ రకాల మొక్కలను నాటేందుకు నగరపాలిక ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగా పార్కు కావాల్సిన అన్ని రంగులను ఏర్పాటు చేస్తున్నారు. శనివారం జిల్లా కలెక్టర్ ఎం.హరి నారాయణన్, జాయింట్ కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ దంపతులు నగర పాలిక కమిషనర్ జె.అరుణలు ఈ పార్కులో పలు మొక్కలను నాటారు. ఈసందర్భంగా జిల్లా కలెక్టర్ నగరపాలిక సిబ్బందితో మాట్లాడుతూ మొక్కలను నాటడంతో పాటు సంరక్షించాల్సిన బాధ్యత అందరికీ ఉందని పార్కును వేగవంతంగా తీర్చిదిద్దాలని, ఈ పార్కు వల్ల ఈకాలనీ చుట్టుపక్కల ఉన్న ప్రజలకు ఒక ఆహ్లాదకరమైన వాతావరణం రావడం జరుగుతుందని ఇటువంటి ప్రశాంత వాతావరణంలో వాకింగ్, ఇతర వ్యాయామం చేయడం వల్ల అందరూ ఆరోగ్యవంతంగా ఉంటారని అన్నారు. ఇది ఒక సుందరమైన పార్కుగా తీర్చిదిద్దాలని కమిషనర్కు సూచించారు.










