
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : ఖమ్మంలో మంత్రి అంబటి రాంబాబుపై దాడికి ప్రయత్నించిన టిడిపి నాయకులను వెంటనే అరెస్టు చేయాలని కోరుతూ శుక్రవారం సాయంత్రం స్థానిక లాడ్జి సెంటర్లో అంబేద్కర్ విగ్రహం వద్ద వైసిపి నాయకులు ధర్నా నిర్వహించారు. ఆలిండియా కాపు అభ్యున్నతి సంఘం ఆధ్వర్యంలో ఖబడ్దార్ తెలుగుదేశం గూండాల్లారా అంటూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఆలిండియా కాపు అభ్యున్నతి సంఘం జిల్లా అధ్యక్షుడు కొత్తపేట సతీష్ మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి కూడా కాపు సామాజిక వర్గం పట్ల చిన్నచూపేనని విమర్శించారు. ఏ రంగంలో కూడా కాపులు ఎదగకూడదన్న ఏకైక లక్ష్యంతోనే ఆ పార్టీ ఆరంభం నుంచి పనిచేస్తూ వస్తుందని ఆయన ఆరోపించారు. కార్పొరేటర్ గేదెల రమేష్,కాకి శ్రీను, కోట రాందాస్, జగన్ కోటి, రాతంశెట్టి మన్నార్, నరాలశెట్టి అర్జున్, కారసాని వెంకట్, బ్రాడీపేట రవి నాయుడు, డి.జయ యూత్ ప్రతినిధులు, రేజేటి నవీన్ పాల్గొన్నారు.