Oct 29,2023 01:02

బెట్టకొచ్చి ఎదుగుదల లోపించిన మిర్చి పైరు

ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : అరు తడి పంటలకు నీరిస్తామనే మంత్రి నీటిమూటగా మారింది.. ఎంతో ఆశతో రైతులు వేసిన పంటలకు నీటి తడులు అందక నష్టాలు మూటగట్టుకుంటున్నారు. రూ.లక్షలు పెట్టుబడి పెట్టి వేసిన పైర్లు బెట్టకు వస్తుంటే రైతులు గుండెలు బాదుకుంటున్నారు.
పల్నాడు జిల్లాలో 7.60 లక్షల ఎకరాల సాగు భూమి ఉండగా ఖరీఫ్‌లో ప్రతి ఏటా 5.12 లక్షల ఎకరాలు సాగు అవుతుంది. రబీ నాటికి 90 శాతం వరకు సాగు చేసేవారు. అయితే ఈ ఏడాది వర్షాభావం, కాల్వలకు నీరు రాని కారణంగా ఇప్పటి వరకు 3.8 లక్షల ఎకరాలే సాగవ్వగా ఆయా భూముల్లో మిర్చి, పసుపు, పత్తి మొక్కజొన్న తదితర పంటలేశారు. గతేడాది సాగు విస్తీర్ణం 78 శాతం కాగా ఈ ఏడాది 55 శాతమే. వీటిల్లో మిర్చి 50,187 ఎకరాలు, పసుపు 332 ఎకరాలు, ఉద్యాన, ఇతర పంటలు 4,415 ఎకరాలు, పత్తి 65,301 ఎకరాలు, పొగాకు 765 ఎకరాలు, అపరాల 18,768 ఎకరాల్లో రబీ పంటలేశారు.
నాగార్జునసాగర్‌ కుడి కాల్వ ఆయకట్టుకు సాగునీరు ఇవ్వబోమని ప్రభుత్వం ప్రకటించడంతో రైతులు చాలా మంది వరి సాగను నిలిపివేశారు. ఆరుతడి పంటలకు నీరిస్తామని ప్రకటన ఆధారంగా పల్నాడు జిల్లా నాగార్జునసాగర్‌ కుడికాల్వ ఆయకట్టు కింద 2.5 లక్షల ఎకరాలకు పైగా రైతులు మిరప, మొక్కజొన్న, పొగాకు, పత్తి, వంటి వాణిజ్య పంటలతో పాటు కంది మినుము, పెసర, అలసంద వంటి అపరాల సాగు చేపట్టారు. అయితే రెండు నెలలుగా చుక్క నీరు లేకపోవడం, కాల్వల ద్వారా సరఫరా చేయకపోవడం వల్ల ఆ పైర్లన్నీ ఎండిపోతున్నాయి. అయితే రైతుల్లో ఆశ చావక మొక్కలను బతికించుకునేందుకు తంటాలు పడుతున్నారు. మరో పది రోజులకైనా వర్షాలు పడకపోతాయా? సాగునీరు విడుదల చేయకపోతారా? అని ట్యాంకర్ల ద్వారా తాత్కాలికంగా నీరు పెట్టుకుంటున్నారు.
సాగుదారుల్లో అధిక శాతం కౌలురైతులే కావడంతో పంటకు పెట్టుబడులతోపాటు కౌలుకూ అప్పులు చేసి చెల్లించారు. తీరా పైరుకు నీరందకపోవడంతో అదనపు ఖర్చునూ భరిస్తూ అప్పుల ఊబిలో కూరుకుపోయారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో తామెంత నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందోనని, ఆందోళనకు గురవుతున్నారు. పొగాకు, మొక్కజొన్న పూర్తిగా ఎండుముఖం పట్టగా మిగిలిన పంటలు ఎండు దశకు చేరుకున్నాయి. ఆరు తడులకు నీరిస్తామని మంత్రి ప్రకటించకుండా ఉండివుంటే తాము పంటలేమీ వేసేవాళ్లం కాదని పలువురు రైతులు నిట్టూరుస్తున్నారు. తమను ఇంతగా ఇంతగా కష్టాల్లోకి నెట్టిన ప్రభుత్వం తమను ఆదుకోవాలని, నష్టాలకు బాధ్యత వహించి పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు.
గత నాలుగేళ్లలో మిర్చికి బొబ్బర తెగులు, తామర పురుగు ఆశించగా పత్తిలో గులాబీరంగు పురుగు, మొక్కజొన్నలో కత్తెర పురుగు, ఇతర తెగుళ్లు వ్యాపించి రైతులను వరుసగా నష్టాల పాల్జేస్తున్నాయి. వైసిపి అధికారంలోకి వచ్చాక ఉమ్మడి గుంటూరు జిల్లాలో 80 మందికి పైగా రైతులు, కౌలురైతులు ఆత్మహత్య చేసుకున్నారు. పంట నష్టపరిహారాలు చెల్లించి ఉంటే ఈ చావులన్నీ తప్పేవని రైతులు, రైతు నాయకులు చెబుతున్నారు. కనీసం మృతి చెందిన రైతు కుటుంబాలకు పరిహారమైనా ఇవ్వలేదని విమర్శిస్తున్నారు.