గుత్తి : మండలంలో ఇటీవల సైబర్ నేరగాళ్ల ఆగడాలు మితిమీరిపోయాయి. నిరక్షరాస్యులు, అక్షరాస్యులు, ఉద్యోగులు నిరుద్యోగులు అనే తేడా లేకుండా అందరినీ సైబర్ నేరగాళ్లు లక్ష్యంగా చేసుకుని మోసం చేస్తున్నారు. మంగళవారం నాడు జెండా వీధికి చెందిన మహమ్మద్ సిరాజుద్దీన్ అనే యువకుడి బ్యాంకు ఖాతా నుంచి రూ. 4,600ను స్వాహా చేసిన విషయం పాఠకులకు విధితమే. ఇది మరువకనే బుధవారం నాడు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి ఓ ఉపాధ్యాయడు మోసం పోయాడు. గ్రహించిన ఉపాధ్యాయుడు పోలీసులను ఆశ్రయించాడు. పట్టణానికి చెందిన సుశీల పద్మావతి అబ్బేదొడ్డి గ్రామంలోని పాఠశాలలో ఉపాధ్యాయినిగా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె తన ఎస్బిఐ బ్యాంకు ఖాతాను పరిశీలించగా రూ.30 వేలు మాయమయ్యింది. ఈనెల 15వ తేదీన రూ.10 వేలు, 16వ తేదీన రూ.10 వేలు, 18 తేదీన రూ.10 వేలును సైబర్ నేరగాళ్లు స్వాహా చేశారు. దీంతో ఆమె స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ను సంప్రదించారు. ఇది సైబర్ నేరగాళ్ల పని అయ్యిఉంటుందని ఆయన తెలిపారు. ఈ మేరకు బాధిత ఉపాధ్యాయురాలు సఐ ఎం.వెంకటరామిరెడ్డికి ఫిర్యాదు చేశారు.










