Oct 24,2023 23:47

కేతిముక్కల అగ్రహారం గ్రామంలో బొబ్బర తెగులు సోకి ముడత ఏర్పడ్డ మిర్చి పొలం

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : ఒకవైపు ఎండిపోతున్న మిర్చి పైరును కాపాడుకోవడానికి రైతులు ఎకరాకు రూ.25-30 వేల వరకూ వెచ్చించి నీటిని ట్యాంకర్ల ద్వారా పెట్టుకుంటున్నారు. అయినా పంట చేతికి రావడం కష్టమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. బొబ్బర తెగులు, తామర పురుగు ఉధృతి రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. బొబ్బర తెగులు సోకిన మొక్క ఎదుగుదల లోపించడంతో పాటు వేగంగా ఒక మొక్క నుండి మరో మొక్కకు వ్యాపిస్తుందని, ఈ తెగులు సోకిన మొక్కలను గుర్తిస్తే వెంటనే పీకేసి తగలబెట్టాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
గతేడాది పల్నాడు జిల్లాలో 1.30 లక్షల ఎకరాల్లో మిర్చి సాగవ్వగా ఈ ఏడాది ఇప్పటి వరకు 32 వేల ఎకరాల్లోనే సాగైంది. వీటిల్లో నాలుగైదు వేల ఎకరాలకు బోర్ల ద్వారా నీటి సదుపాయం ఉండగా మిగతా పొలాలన్నీ కాల్వలు, వర్షం ఆధారంగా సాగైనవే. ఖరీఫ్‌లో సాగు చేసిన మినుము పూర్తిగా నష్టపోగా ఆ పొలాలను దున్ని కొంతమంది మిర్చి సాగు చేశారు. మిర్చికి ఇప్పుడు తామర పురుగు, బొబ్బర తెగులు సోకడంతో ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. బెట్ట పరిస్థితుల్లో ఈ తెగులు మరింత ఉధృతంగా వ్యాపిస్తుందని రైతులు కంగారు పడుతున్నారు. పోనీ ప్రభుత్వ సాయం, బీమా పరిహారం ఏమైనా అందుతుందా? అంటే అదీలేదు. ప్రభుత్వం కూడా నీటిపారుదల భూమి, వర్షాధార భూమి అనే సాకులతో బీమా పథకానికి రైతులను దూరం చేస్తోంది. ఒకవైపు నీటి ఎద్దడి మరోవైపు తెగుళ్లతో పైరు ఎదగకుండా పూత, పిందె రాలిపోవడంతో మిర్చిపంటపై రైతుల్లో ఆశలు సన్నగిల్లుతున్నాయి.
ఇప్పటికే నీటి ఎదుడి ఎదుర్కొంటున్న మిర్చిని కాపాడుకోవడానికి రైతులు అధిక ఖర్చును భరించి ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నారు. ఆరుతడి పంటలకు నీరిస్తామనే ప్రభుత్వ ప్రకటనతో కొద్ది రోజుల్లో అయినా పైర్లకు నీరు వస్తుందని కదా? అనే ఉద్దేశంతో రైతులు ఇప్పుడు నీటి కొనుగోలుకు సిద్ధమయ్యారు. అయితే పంటకాలం పూర్తయ్యే వరకూ నీటిని కొనుగోలు చేయాల్సి రావడం అంటే అది తమవల్ల అయ్యే పని కాదని రైతులు నిరాశకు గురవుతున్నారు. ఇప్పటికే అప్పులు చేసి మరీ ఎకరాకు రూ.80 వేలు నుండి రూ.లక్ష వరకు పెట్టిన పెట్టుబడుల్లో ఒక్క రూపాయి కూడా తిరిగొచ్చే పరిస్థితి లేదని, తీవ్ర ఆర్థిక నష్టాలను చవి చూస్తున్నామని, రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం స్పందించాలని, మిర్చి పొలాలను వ్యవసాయ శాఖాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని రైతులు కోరుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
బోర్ల నుండి కూడా చుక్కనీరు రావడం లేదు
ఎరుగుల లక్ష్మారెడ్డి, రైతు, బొల్లాపల్లి.

ఆరుతడి పంటలకు నీరిస్తారనే ఆశతో నాకున్న రెండెకరాలతోపాటు మరో రెండెకరాలు కౌలుకు తీసుకున్నాను. ఎకరా రూ.20 వేలు చొప్పున ముందుగానే కౌలు చెల్లించి మొత్తం నాలుగెకరాల్లో మిర్చి సాగు చేశాను. వర్షాల్లేవు. బోర్లలో నీరు కూడా రావడం లేదు. ఇప్పటికి ఎకరాకు రూ.70 వేలు చొప్పున నాలుగు ఎకరాలకు రూ.3 లక్షల వరకు పెట్టుబడి పెట్టాను. పురుగు మందు పిచికారి చేయాలన్నా గ్రామం నుంచి ట్యాంకర్‌ ద్వారా నీటిని తెచ్చుకోవాల్సిందే. దీనికితోడు పైరుకు బొబ్బర తెగులు వచ్చింది. తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలి.
నీటి తడులు ఇస్తేనే నష్టాలు తప్పేది
కోండ్రు పిచ్చారావు, రైతు, కుంకలగుంట, నకరికల్లు మండలం.

కొద్దిపాటి సొంత పొలంతో పాటు 30 ఎకరాలకు పైగా పొలం కౌలుకు తీసుకొని 18 ఏళ్లుగా పత్తి, మిర్చి, శనగ, వరి, మొక్కజొన్న పంటలు సాగు చేస్తున్నాను. మిర్చిలో ఆరేళ్లుగా తామర పురుగు వల్ల నష్టపోతున్నాను. ఈ ఏడాది వర్షాభావం ఉన్నా ఆరుతడి పంటలు వేసుకోవచ్చనే ప్రభుత్వ ప్రకటనతో పదెకరాలకు ముందస్తు కౌలు చెల్లించి మిర్చి సాగు చేశాను. ప్రస్తుతం పైరు బెట్టకు రావడంతోపాటు బొబ్బర తెగులు, తామర పురుగు ఉధృతంగా వ్యాపించింది. ఇప్పటికి ఎకరాకు రూ.60 వేలు వరకు పెట్టుబడి అయ్యింది. ప్రస్తుతం నీటి తడి ఇవ్వకపోతే తోటను దున్నేసుకోవాల్సిందే. ఐదారు నీటి తడులు అందించి తెగుళ్లను నివారించగలిగితే పెట్టుబడులు కొంతవరకైనా వస్తాయి. లేకుంటే నష్టాల్లో కూరుకుపోవడమే.
రైతులకు బీమా పరిహారం ఇచ్చి ప్రభుత్వమే ఆదుకోవాలి
ఏపూరి గోపాలరావు, రైతు సంఘం పల్నాడు జిల్లా కార్యదర్శి
కె.రామారావు, కౌలురైతు సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షులు

ఎండిపోతున్న పైర్లకు సాగర్‌ జలాలను మోటార్ల ద్వారా అయినా అందించి కాపాడాలి. తెగుళ్ల బారిన పడ్డ పొలాలను వ్యవసాయ శాఖాధికారులు పరిశీలించి పంట నష్టం అంచనా వేసి పరిహారం అందేలా చూడాలి. బోర్లు, బావులు కింద మోటార్ల ద్వారా సాగవుతున్న పొలాలకు 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ను అంతరాయం లేకుండా సరఫరా చేయాలి. సాగుదార్లలో 70 శాతం మంది కౌలురైతులే. వీరి కోసం ప్రత్యేక నిధిని కేటాయించి నష్టపరిహారం చెల్లించాలి. లేకుంటే వీరంతా అప్పుల నుండి బయటపడలేక ఆర్థికంగా చితికిపోవడంతోపాటు ఆ ఇబ్బందుల నుండి బయటపడలేక సాగుకు వెనకడుగేసే పరిస్థితి వస్తుంది. రైతులను, కౌల్దార్లను ప్రభుత్వం ఆదుకోవాలి. లేకుంటే రైతు, కౌలురైతు సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమిస్తాం.