
ప్రజాశక్తి- అనకాపల్లి
మోడీ ప్రభుత్వంలో పత్రికా రంగంపై దాడులు పెరగడం అమానుషమని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి జి.కోటేశ్వరరావు విమర్శించారు. బిజెపి అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై కథనాలు రాసిన న్యూఢిల్లీలోని న్యూస్ క్లిక్ ఎడిటర్ పుర్కాయస్థపై కక్ష కట్టిన మోడీ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ సోమవారం స్థానిక సిఐటియు కార్యాలయం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా నెహ్రూ చౌక్ జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడ అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ న్యూస్ క్లిక్ ఎడిటర్ పుర్కాయస్థ అరెస్టు పత్రిక రంగానికి, మీడియా రంగానికి ఆందోళన కలిగిస్తున్న అంశమన్నారు. ఎపిడబ్ల్యుజెఎఫ్ జిల్లా గౌరవాధ్యక్షులు జి కాంతారావు మాట్లాడుతూ మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా మీడియాపై దాడులకు పాల్పడిన సంగతిని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి వివి శ్రీనివాసరావు, నాయకులు ఈశ్వరరావు, అల్లు రాజు, విలేకరులు ఎం.అజరు, ఆత్మారాం, అనకాపల్లి రామస్వామి, రమణ, శ్రీనివాస్, వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా కార్యదర్శి బి.నూక అప్పారావు పాల్గొన్నారు.
ఎపిడబ్ల్యుజెఎఫ్ ఆధ్వర్యాన నిరసన
ఢిల్లీలో న్యూస్ క్లిక్ ఎడిటర్ ప్రబీర్ పుర్కాయస్థ అక్రమ అరెస్టును నిరసిస్తూ, పత్రికా స్వేచ్ఛను కాపాడాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (ఎపిడబ్ల్యుజెఎఫ్) ఆధ్వర్యంలో జర్నలిస్టులు సోమవారం స్థానిక కోడుగంటి గోవిందరావు భవనం నుండి నెహ్రూ చౌక్ జంక్షన్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి, అక్కడ ధర్నా చేశారు. అనంతరం ఆర్డీవో కార్యాలయం వద్ద నిరసన తెలియజేసి, ఏవో రవి కుమార్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు బి.వెంకటేష్ మాట్లాడుతూ జర్నలిస్టులపై రోజు రోజుకూ దాడులు పెరుగుతున్నాయన్నారు. ఫెడరేషన్ జిల్లా గౌరవాధ్యక్షులు జి.కాంతారావు మాట్లాడుతూ ఢిల్లీలో రైతులు చేపట్టిన ఉద్యమాలకు అనుకూలంగా వార్తలు రాయడంతో కేంద్ర ప్రభుత్వం ఆయనపై కక్ష సాధింపునకు పూనుకుంటుందని విమర్శించారు. మీడియాపై దాడులు, జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించడం పత్రికా స్వేచ్ఛను హరించడమేనని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బి.కొండలరావు, కార్యదర్శి పి.రామకృష్ణ, ఫెడరేషన్ ప్రతినిధులు మార్టూరు అజరు, గంటా శ్రీనివాసరావు, బాషా, రాజా, రమేష్, పి.నాగ, కె.మోహన్ బాబు, పి.రామారావు, కె.గణేష్, పి.సత్యనారాయణ, నటరాజ్, గంగాధర్, బొడ్డేడ శ్రీను, నాయుడు, కుమార్, మణి కుమార్, ఎన్.వెంకటరమణ, దేవుడు బాబు, స్వామి, బి.అప్పారావు తదితరులు పాల్గొన్నారు.