
ప్రజాశక్తి- అనకాపల్లి
మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఎపి మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘం (సిఐటియు) రాష్ట్ర అధ్యక్షులు జి.వరలక్ష్మి డిమాండ్ చేశారు. అనకాపల్లి సిఐటియు కార్యాలయంలో శనివారం జరిగిన సంఘం ముఖ్య నాయకుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ పథకం ప్రారంభమై 20 సంవత్సరాలైనా నేటికీ కార్మికుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా పరిష్కారం కాలేదని వాపోయారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా కార్మికుల బతుకుల్లో మాత్రం మార్పు రాలేదన్నారు. పైగా ప్రభుత్వాలు మారినప్పుడల్లా వర్కర్స్ను వేధింపులకు గురి చేస్తూ అక్రమంగా తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చిన వైసిపి, మూడు వేల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుందని పేర్కొన్నారు. రకరకాల మెనో అమలుతో కార్మికులపై పనిభారం పెంచింది తప్ప వేతనాలు పెంచలేదన్నారు. వంట చేస్తున్నప్పుడు ప్రమాదాలు జరిగి కార్మికులు చనిపోయినా కనీసం నష్టపరిహారం ఇవ్వడం లేదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించి, వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. లేకుంటే వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాలు సందర్భంగా కార్మికులనందరిని ఐక్యం చేసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షలు ఆర్.శంకర్రావు, యూనియన్ నాయకులు శ్రీదేవి, షేక్ బేబి, లోవలక్ష్మి, బంగారమ్మ, లక్ష్మి, సత్యారావు, కనకారావు తదితరులు పాల్గొన్నారు.