జగనన్న కాలనీల పరిశీలనలో కలెక్టర్ ప్రశాంతి
ప్రజాశక్తి - గణపవరం
మే నెలాఖరుకు జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశించారు. మండలంలో గణపవరం, పిప్పర గ్రామాల్లోని జగనన్న కాలనీలను ఆమె మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ గణపవరం జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణం ఎందుకు ఆలస్యమవుతుందని అధికారులను ప్రశ్నించారు. లబ్ధిదారులకు నీరు, విద్యుత్ వసతి లేకపోవడంతో ఆలస్యమవుతుందని వివరించారు. కాలనీకి వెళ్లేందుకు వెంటనే అప్రోచ్ రోడ్డు నిర్మించాలని, నీటి వసతికి చెరువు నిర్మాణం చేయాలని, విద్యుత్ సౌకర్యం కల్పించి వీధి దీపాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జగనన్న కాలనీలో లబ్ధిదారులు త్వరత గతిలో ఇల్ల నిర్మాణం చేయడానికి అధికారులు లబ్ధిదారులను ప్రోత్సహించాలని సూచించారు. పిప్పర కాలనీలో లబ్ధిదారులకు అన్ని వసతులూ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో తహశీల్దార్ పమ్మి లక్ష్మి, ఎంపిడిఒ జ్యోతిర్మయి, ఆర్డబ్ల్యూఎస్ జెఇ హరినాధ్రాజు, హౌసింగ్ జెఇ ఎమ్డి గౌస్పాషా, గణపవరం పంచాయతీ కార్యదర్శి డిఎస్ఆర్.ప్రసాద్, సరిపల్లి పంచాయతీ కార్యదర్శి డి.రామాంజనేయులు, గణపవరం సర్పంచి మూల అలంకారం, సరిపల్లి సర్పంచి చనుమూరి లక్ష్మిభవాని, పిప్పర సర్పంచి కాకర బేబీ, కార్యదర్శి జి.బాలకృష్ణ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.










