ప్రజాశక్తి-రాయదుర్గం ప్రస్తుత వైసిపి ప్రభుత్వ పాలనలో ముస్లిం మైనారిటీలపై జరుగుతున్న అరాచకాలను ఎండగట్టాలని టిడిపి మైనారిటీ విభాగం జిల్లా అధ్యక్షులు సాలార్ బాషా పిలుపునిచ్చారు. శనివారం రాయదుర్గం వచ్చిన సందర్భంగా పార్టీ నియోజకవర్గ పరిశీలకులు పర్వీన్తాజ్తో కలిసి శనివారం పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముస్లిములందరూ ఏకతాటిపైకి వచ్చి దాడుల నియంత్రణ, సమస్యల పరిష్కారానికి ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. యువ నాయకులు నారా లోకేష్ అంచనా ప్రకారం రాష్ట్రంలో 52 శాతం మంది ముస్లిం మైనారిటీలు టిడిపికి మద్దతు ఇస్తున్నారన్నారు. ఆయా సమస్యల పరిష్కారం, దాడుల నియంత్రపై చర్చించేందుకు ఈనెలఖరున ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి హాజరుకావాలని మాజీమంత్రి కాలవ శ్రీనివాసులును ఆహ్వానించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో టిడిపి మైనారిటీల విభాగం జిల్లా కార్యదర్శి రఫిక్అహ్మద్, జిల్లా అధికార ప్రతినిధి బాబా ఫక్రుద్దీన్, మీడియా కోఆర్డినేటర్ ఎస్ఎన్ బాషా, నియోజకవర్గ అధ్యక్షులు మహబూబ్బాషా, పార్లమెంటరీ కార్యదర్శి ఉస్మాన్బాషా, స్థానిక నాయకులు జమీల్ఖాన్, ఇనాయత్ బాషా, లతీఫ్ షేక్ మజ్జు, తదితరులు పాల్గొన్నారు.
విలేకరులతో మాట్లాడుతున్న ముస్లిం మైనారిటీ నాయకులు










