Jun 14,2023 22:54

విజయవాడలో ఎపి ఈఏపీ సెట్‌ ఫలితాలను విడుదల చేస్తున్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, చిత్రంలో అనంతపురం జెఎన్‌టియు విసి రంగజనర్ధాన

      అనంతపురం ప్రతినిధి : ఎపి ఇఎపిసెట్‌ పరీక్షా ఫలితాల్లో బడిపంతుల పిల్లలు అద్భుత ర్యాంకులు సాధించి మెరిశారు. ఉపాధ్యాయుల పిల్లలకు ప్రధానమైన ర్యాంకులొచ్చాయి. ఇంజినీరింగ్‌లో జిల్లా మొదటి ర్యాంకు, అగ్రికల్చర్‌లో రెండు ప్రధాన ర్యాంకులు ఉపాధ్యాయుల పిల్లలే ఉండటం గమనార్హం.
బాలికలదే హవా
ఇంజినీరింగ్‌ ఫలితాలు జిల్లాల వారీగా చూసినప్పుడు బాలికలే మెరుగైన ఫలితాలు సాధించారు. అనంతపురం, సత్యసాయి జిల్లా కలిపి ఇంజినీరింగ్‌ 11812 మంది హాజరయ్యారు. ఇందులో 8590 మంది క్వాలిఫై అయ్యారు. 72 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలురు 6252 మంది హాజరయ్యారు. 4451 మంది ఉత్తీర్ణత సాధించారు. 71 శాతం క్వాలిఫై అయ్యారు. 5560 మంది బాలికలు హాజరయ్యారు. 4139 మంది క్వాలిఫై సాధించిన వారిలోనున్నారు. 74 శాతం మంది ఇంజినీరింగ్‌లో క్వాలిఫై అయ్యారు. అగ్రికల్చర్‌ విభాగంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో 4935 పరీక్ష రాశారు. ఇందులో 4269 మంది క్వాలిఫై అయ్యారు. అనంతపురం జిల్లాలో 1305 మంది పరీక్ష రాశారు. ఇందులో 1128 మంది క్వాలిఫై అయ్యారు. 3214 మంది బాలికలు పరీక్ష రాయగా 2756 మంది క్వాలిఫై సాధించారు. సత్యసాయి జిల్లాలో బాలురు 98 మంది హాజరై 91 మంది క్వాలిఫై అయ్యారు. 325 మంది బాలికలు హాజరై 303 మంది క్వాలిఫై అయ్యారు.
ఇంజినీరింగులో 500 లోపు పది ర్యాంకులు
ఎపి ఇఎపిసెట్‌లో 500 ర్యాంకులోపు పది మంది ఉమ్మడి అనంతపురం జిల్లా విద్యార్థులున్నారు. అనంతపురం నగరంలోని రామచంద్రనగర్‌కు చెందిన మేడాపురం లక్ష్మినరసింహ మాధవ భరద్వాజ్‌కు రాష్ట్ర స్థాయి ఎనిమిదవ ర్యాంకు సాధించారు. తాడిపత్రి జికె స్ట్రీట్‌కు చెందిన పొన్నతోట ప్రమోద కుమార్‌రెడ్డికి 28వ ర్యాంకు, ఆర్‌కె.నగర్‌కు చెందిన సొదుం లేఖనాకు 49వ ర్యాంకు, అనంతపురం నగరంలోని అశోక్‌ నగర్‌కు చిలంకూరు కుందన్‌ సాయికి 76వ ర్యాంకు, ఒవిఆర్‌ కాలనీకి చెందిన సురం సాయి స్వప్నిత్‌రెడ్డి 159వ ర్యాంకు, అంబటి రోషిత్‌ అభిరాంకు 217వ ర్యాంకు భూపతి నిఖిల్‌ అగ్నిహోత్రికి 325వ ర్యాంకు, నీలపరెడ్డి యశో శ్రీకర్‌ఆధిత్యరెడ్డికి 396వ ర్యాంకు, శీలం మైత్రేష్‌ బాబుకు 414వ ర్యాంకు, మట్లూరు అరుణ్‌ సుజిత్‌కు 422వ ర్యాంకు వచ్చింది. ఇక అగ్రికల్చర్‌లో 300 లోపే పది ర్యాంకులొచ్చాయి. అనంతపురం నగరంలోని జార్జీపేట్‌కు చెందిన జెరిపోతుల శ్రీవాత్సవ్‌రెడ్డికి 20వ ర్యాంకు వచ్చింది. కదిరి పట్టణంలోని అడపాల వీధిలో షేక్‌ ఫైజా సమ్రీన్‌కు 30వ ర్యాంకు వచ్చింది. అనంతపురం నగరంలోని లేపాక్షినగర్‌లో ఉంటున్న గంధమనేని గిరి వాత్సవ్‌, కంబదూరు విద్యా బొంధితకు 62వ ర్యాంకు, ధనకొండ చైతన్య 141వ ర్యాంకు జాగృతి బోడెద్దుల 176వ ర్యాంకు, గొల్ల జయవర్థన్‌ 198వ ర్యాంకు, కమ్మర త్రిదేవ్‌ 206వ ర్యాంకు, ఎఎన్‌ ప్రవీణ్‌కు 252వ ర్యాంకు, తడల తరుణ్‌ 254వ ర్యాంకు వచ్చింది.
బండిపంతుల పిల్లలే...
రాష్ట్ర స్థాయి ఇంజినీరింగ్‌ టెస్టు (ఎపి ఇఎపిసెట్‌)లో బడిపంతుల పిల్లలకు మెరుగైన ర్యాంకులు వచ్చాయి. ఇంజినీరింగ్‌ విభాగంలో అనంతపురం నగరంలోని రామచంద్రనగర్‌లో ఉంటున్న మేడాపురం లక్ష్మి నరసింహ మాధవ భరద్వాజ్‌కు రాష్ట్ర స్థాయి 8వ ర్యాంకు వచ్చింది. ఇతనికి అఖిల భారత ఇంజినీరింగ్‌ పరీక్ష జెఇఇలోనూ 25వ ర్యాంకు వచ్చింది. తండ్రి సత్యనారాయణమూర్తి మెడికల్‌ ఏజెన్సీ నిర్వహుకుడు కాగా, తల్లి ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. హైదరాబాద్‌లో నారాయణ జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ను భరద్వాజ్‌ పూర్తి చేశారు. తమ పిల్లాడికి రెండు పరీక్షల్లోనూ మంచి మార్కులు రావడం పట్ల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. అగ్రికల్చర్‌లో జిల్లాలో ప్రధాన ర్యాంకు సాధించిన జరిపోతుల శ్రీ వాత్సవ్‌రెడ్డి తండ్రి మదన్‌మోహన్‌రెడ్డి, తల్లి భారతి ఇద్దరూ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. షేక్‌ ఫైజా సమ్రీన్‌ 30వ ర్యాంకు సాధించింది. ఈమె తండ్రి సలీమ్‌ బాషా కూడా ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.