ప్రజాశక్తి - పెనుగొండ
గంజాయి, కొకైన్, హెరైన్ వంటి మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే క్రమంగా ఆరోగ్యం పాడవ్వడంతో పాటు సమాజం తప్పుదారి పడుతుందని తణుకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ సిఐ ఆర్.సత్యవతి స్పష్టం చేశారు. స్థానిక ఎస్వికెపి అండ్ కెఎస్ రాజు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన యాంటీ డ్రగ్స్పై అవగాహన కార్యక్రమం కళాశాల ప్రిన్సిపల్ వైవివి అప్పారావు అధ్యక్షతన బుధవారం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థి స్థాయిలో చెడు అలవాట్లకు బానిసయ్యే అవకాశం ఉందని, జాగ్రత్తలు తీసుకోవాలని, మంచి స్నేహితులను కలిగిఉండాలని హితవు పలికారు. విద్యార్థులు మంచి అలవాట్లను అలవర్చుకోవాలన్నారు. ప్రిన్సిపల్ అప్పారావు మాట్లాడారు. మాదకద్రవ్యాల రహిత సమాజం నిర్మించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్సిసి అధికారి కె.చిరంజీవి, ఎన్ఎస్ఎస్ అధికారులు ఆర్ఎస్.శ్రీనివాస్, పి.మీరయ్య, టి.దివాకర్, కె.సురేష్బాబు, మహిళా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.










