ప్రజాశక్తి-ఉరవకొండ జగనన్న నువ్వే మా నమ్మకం.. మా భవిష్యత్తు కార్యక్రమానికి నియోజకవర్గంలో ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందని మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 'జగనన్నే మా భవిష్యత్తు' అనే నినాదంతో ఏప్రిల్ 7 తేదీ నుంచి 29 వరకు 23 రోజులపాటు నియోజకవర్గంలోనూ మెగా పీపుల్స్ సర్వే చేపట్టామన్నారు. నియోజకవర్గంలో మొత్తం 86,635 కుటుంబాలకు 76,899 కుటుంబాలను కలిసి జగనన్న పాలన, సంక్షేమ పథకాలపై అభిప్రాయాలను సేకరించినట్లు తెలిపారు. ఇందులో 59 వేల కుటుంబాలు మిస్డ్కాల్స్ ఇచ్చారన్నారు. ఈ సర్వేలో ప్రజలంతా సీఎం జగన్మోహన్ రెడ్డిపై తమ అభిమానాన్ని చాటుకున్నారని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమం పట్ల ఆయనకు ఉన్న చిత్తశుద్ధిని ప్రజలు నమ్ముతున్నారన్నారు. ఒకవైపు దుష్టచతుష్టయం ఎన్ని దుష్ప్రచారాలు చేసినా ప్రజలు నమ్మడం లేదని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జెసిఎస్ కన్వీనర్లు తేజోనాథ్, ఆసీఫ్, భరత్రెడ్డి, రాచనగౌడ్, దేవేంద్ర, దుద్దేకుంట రామాంజనేయులు, వైస్ ఎంపిపి నరసింహులు, పంచాయతీ రాజ్ విభాగం అధ్యక్షుడు బసవరాజు, మాజీ ఎంపిపి ఎసి ఎర్రిస్వామి, పెన్నహోబిలం మాజీ ఛైర్మన్ అశోక్కుమార్, నెరిమెట్ల సర్పంచి యోగేంద్రరెడ్డి, నాయకులు రాయంపల్లి ఎర్రిస్వామిరెడ్డి, సామానాయక్, బ్యాళ్ల ప్రసాద్, వేమన్న, వడ్డే ఆంజనేయులు, జోగి భీమన్న, తదితరులు పాల్గొన్నారు.
'మానమ్మకం' పోస్టర్లను చూపుతున్న మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి










