
ప్రజాశక్తి-పిడుగురాళ్ల : పట్టణంలోని పృథ్వీ రెసిడెన్సీ అనే లాడ్జి గదిలో యువతి ఉరికి వేళ్లాడుతూ మృతి చెందగా యువకుడు రక్తపు మడుగులో పడి ఉన్న ఘటన బుధవారం చోటుచేసుకుంది. పట్టణ సిఐ టివి ఆంజనేయులు వివరాల ప్రకారం... పట్టణంలోని కుమ్మరిపాలెంలో ఎస్కె షబ్బీర్ నివాసం ఉంటున్నాడు. ఏడాది క్రితం భార్యతో మనస్పర్ధల వల్ల విడిపోయి ఉంటున్నాడు. ఈ క్రమంలోనే షబ్బీర్ ఇంట్లో ఆయేషా బేగం (21) తల్లిదండ్రులు అద్దెకు ఉంటుండగా ఆయేషా బేగంతో షబ్బీర్కు పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. బుధవారం ఉదయం పట్టణంలోని ఓ మొబైల్ ఫోన్ షాప్లో పనిచేసే తమ అమ్మాయి ఇంటికి రాలేదని ఆయేషా బేగం తండ్రి రెహమాన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయటంతో పిడుగురాళ్ల పట్టణ పోలీసులు విచారణ చేపట్టారు. ఆయేషా బేగం ఫోన్ నెంబర్ ద్వారా ఆమె పృథ్వీ రెసిడెన్సి లాడ్జిలో ఉందని గుర్తించి వెళ్లి చూడగా గది తలుపులు మూసి ఉంది. తలుపులను ఎంతసేపు కొట్టినా తీయకపోవడంతో వాటిని బద్దలు కొట్టారు. ఆయేషా బేగం ఉరేసుకుని మృతి చెందగా, షబ్బీర్ రెండు చేతులు కత్తితో కోసుకొని రక్తపు మడుగులో ఉన్నాడు. షబ్బీర్ను పట్టణంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు సిఐ తెలిపారు. విచారణలో మరిన్ని వివరాలు తెలుస్తాయని సిఐ చెప్పారు.