Oct 21,2023 23:39

మాట్లాడుతున్న ఆర్‌ఎఆర్‌ఎస్‌ సహ సంచాలకులు జగన్నాథరావు

ప్రజాశక్తి-అనకాపల్లి
ప్రస్తుతం జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఖరీఫ్‌ పంటలకు వర్షాలు ప్రాణావసరమని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పరిశోధన సహ సంచాలకులు డాక్టర్‌ పివికె.జగన్నాధరావు అన్నారు. స్థానిక ఆర్‌ఏఆర్‌ఎస్‌లో శనివారం జరిగిన శిక్షణ సందర్శన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో సెప్టెంబర్‌లో కురిసిన వర్షాలతో 80 శాతం రైతులు వరి నాట్లు వేశారని, అయితే అక్టోబర్లో కేవలం 19 శాతం మాత్రమే సాధారణ వర్షపాతం నమోదు కావడం, రాబోయే వారం పది రోజుల్లో వర్షాలు కురియకుంటే తీవ్ర నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. అనంతరం ప్రస్తుత వరిలో పాము పొడ తెగులు, దోమ, ఆకు ముడత తెగులు ఆశించిన నేపథ్యంలో నివారణ చర్యలు సూచించాల్సిందిగా వ్యవసాయ అధికారులు శాస్త్రవేత్తలను కోరారు. శాస్త్రవేత్తలు చీడపీడల నివారణ, జీవన ఎరువులు జీవ నియంత్రణ పద్ధతులపై వివరించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు కెవి రమణమూర్తి, ముకుందరావు, ఎం విశాలాక్షి, ఎం శిరీష, పి శ్రీదేవి, డి ఉమామహేశ్వరరావు, డాక్టర్‌ ఎంబీజీఎస్‌ కుమారి, వ్యవసాయ శాఖ అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు.