ప్రజాశక్తి-అనంతపురం వర్షాభావం, కరువు సంక్షోభ నివారణకు జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలని జాయింట్ కలెక్టర్ ఖేతన్గార్గ్ ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు కరువు, సంక్షోభం నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. దీన్ని అధిగమించేందుకు వ్యవసాయ, అనుబంధ శాఖలు కరువు ప్రణాళికలు తయారు చేసి అమలు చేయాలని కోరారు. ముఖ్యంగా వ్యవసాయ శాఖ ద్వారా వరి పంట కాకుండా తక్కువ నీటితో పండే రాగి, కొర్ర, జొన్న, ఇతర పంటల సాగుకు రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారిణి యు.ఉమామహేశ్వరమ్మ, సిపిఒ, ఉద్యానవన, పశుసంవర్ధక శాఖ, సూక్ష్మ, భారీ నీటిపారుదల శాఖ, పౌరసరఫరాల శాఖ అధికారులు, ఐసిడిఎస్ పీడీ, భూగర్భ జల శాఖ అధికారులు పాల్గొన్నారు.
అధికారులతో మాట్లాడుతున్న జెసి కేతన్గార్గ్










