
ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి : పల్నాడు జిల్లా పూర్తిగా కరువు కోరల్లో చిక్కుకుంది. ఈ ఏడాది ఏర్పడిన తీవ్ర వర్షాభావం ప్రభావంతో 28 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు తీవ్ర రూపం దాల్చాయి. మొత్తం విస్తీర్ణంలో వ్యవసాయ పంటలు 50 కంటే తక్కువగా సాగయ్యాయి. ఉద్యాన పంటల సాగుకూడా గణనీయంగా తగ్గింది. మొత్తంగా 3 లక్షల ఎకరాల్లో పంటలేయడానికి వాతావరణం పరిస్థితులు సహకరించలేదు. వర్షాభావం, జలాశయాల్లో నీటి నిల్వలు లేకపోవడం వల్ల సాగు గణనీయంగా తగ్గింది. సాగైన పొలాల్లో కూడా దిగుబడి 50 శాతం కంటే తక్కువగా రావచ్చని అధికారులు అంచనా వేశారు. దీంతో అన్ని మండలాలను కరవు మండలాలుగా గుర్తించాలని జిల్లా అధికారులు ఇచ్చిన నివేదికపై జిల్లా కలెక్టర్ ఎల్.శివశంకర్ ప్రభుత్వానికి నివేదిక పంపారు.
గత ఏడాది కంటే ఈ ఏడాది వర్షపాతం 28 మండలాలకు 25 మండలాల్లో 50 శాతం కంటే తక్కువగా ఉన్నట్టు నివేదికలు ఇచ్చారు. పత్తి, వరి, మిర్చి, కంది పంటలు దిగుబడి గణనీయంగా తగ్గుతుందని వేసిన పంటలను కాపాడుకునేందుకు రైతులు తీవ్రంగా శ్రమిస్తున్నారని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. ప్రధానంగా సాగర్ ఆయకట్టులో వరి సాగు బాగా తగ్గింది. లక్షా 12 వేల ఎకరాలకు గాను కేవలం 28 వేల ఎకరాల్లోనే పంటలు సాగయ్యాయి. వర్షాభావం వల్ల దిగుబడి ఎకరాకు ఐదారు బస్తాల కంటే ఎక్కువగానే తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.
జిల్లాలో మొత్తం 6.80 లక్షల ఎకరాల్లో ఈ ఏడాది సాగు చేస్తారని అంచనా కాగా ఇప్పటి వరకు 3.80 లక్షల ఎకరాల్లోనే వివిధ రకాల పంటలను సాగు చేశారు. పత్తి 1.90 లక్షల ఎకరాలు, మిర్చి లక్ష ఎకరాలు, కంది 40 వేల ఎకరాలు, వరి 28 వేల ఎకరాలు, ఇతర పంటలు మరో 22 వేల ఎకరాల్లో సాగయ్యాయి. 3 లక్షల లక్షల ఎకరాల భూముల్లో పంటలేమీ వేయకపోవడం వల్ల ఖాళీగా ఉన్నాయి. ఈ భూముల్లో రబీసాగు చేయడానికి కూడా అవకాశాలు మృగ్యమవుతున్నాయి. గత నెల రోజులు వర్షాలు లేకపోవడం వల్ల ఆరుతడి పంటలు కూడా సాగు చేయడానికి రైతులు ముందడుగు వేయలేకపోతున్నారు. సాగర్ కాల్వల నుంచి తాగునీటి అవసరాల పేరుతో చెరువులకు నీరు ఇచ్చేందుకు ఐదు టిఎంసిలు ఇటీవల విడుదల చేయగా కొంత నీటిని పంటలకు మళ్లించారు. అయినా సరిపోలేదు. ఒక వైపు వర్షాలు లేకపోవడం, మరో వైపు ఎండల తీవ్రత పెరగడంతోపంటలను కాపాడుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. నీరు ఎక్కడ దొరికితే అక్కడ ట్యాంకర్ల ద్వారా తెచ్చి కడవలతో పొలాలను తడుపుతున్న దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. నీటిని రవాణా చేయడం, నీటిని పొలాల్లో పైర్లకు చల్లడానికి రైతులకు ఎకరాకు రెండు నుంచి మూడు వేల వరకు అదనపు భారం ఖర్చవుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కరువు పరిస్థితులపై నివేదిక కోరింది. పల్నాడు జిల్లాలోని అన్ని మండలాల్లోనే సాగు సంక్షోభం నెలకొందని అధికారులు నివేదించారు.