
- జిల్లా గౌరవ అద్యక్షులు వాకా రామచంద్ర రావు
ప్రజాశక్తి-కలక్టరేట్ (కృష్ణా) : ఈ నెల 25వ తేదీన కృష్ణా జిల్లాలో ఉయ్యూరులో జరిగే ఆంధ్రప్రదేశ్ కల్లు గీత కార్మిక సంఘం పదవ రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలని సంఘ జిల్లా గౌరవ అద్యక్షులు వాకా రామచంద్ర రావు గీతా కార్మికులకు పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక జ్యోతిరావు పూలే విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో రామచంద్రరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కల్లు గీత కార్మిక సంఘం గీత కార్మికుల సమస్యలపై వారి హక్కుల సాధనకై నిరంతరం ఆందోళన చేస్తూ, సమగ్ర చట్టం చేయాలని, నీరా ప్రాజెక్టు చేపట్టాలని, కల్లగీత ఆర్ధిక కార్పొరేషన్ను పునరుద్దరించి పెడరేషన్ గా మార్చాలని తదితర సమస్యలపై మన సంఘం పోరాటం చేస్తుందన్నారు.కాని ప్రస్తుతం ప్రభుత్వం నుండి వృత్తికి ఎటువంటి రక్షణ లేకపోవటంతో మన కల్లుగీత వృత్తి కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వృత్తిదారులకు 10 లక్షలు ఎక్స్-గ్రేషియో ప్రకటించినప్పటికి విధి విధానాలు ప్రకటించకపోవటంతో చెట్లుపై నుండి పడిపోయినవారికి అందని ద్రాక్షాలాగా తయారయ్యిందన్నారు. ప్రభుత్వాలు చేతి వృత్తిదారులకు అందిస్తున్న సంక్షేమ పధకాలలో గీత కార్మికులకు వై.యస్.ఆర్.గీతన్న నేస్తం లేకపోవటం, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విశ్వకర్మ కౌసల్య యోజన పధకంలో కల్లు గీత వృత్తిని చేర్చకపోవటం అన్యాయం అన్నారు. కాబట్టి కల్లుగీత కార్మిక సంఘాన్ని బలపరచి ముందుకు తీసుకు వెళ్ళుటకు, నూతన జిల్లా కమిటీని ఏర్పాటు చేసుకుని, భవిష్యత్ కర్తవ్యాలను రూపొందించుటకు ఈ నెల 25వ తేదీన ఉయ్యూరు నాగళ్ళ రాజేశ్వరమ్మ ,జానకి రామయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే కృష్ణాజిల్లా 10వ మహా సభలకు ఎక్కువ మంది గీత కార్మికులు హజరై జయప్రదం చేయవలసినదిగా విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మహాసభ బ్రొచర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పామార్తి.వెంకటేశ్వరావు, పరసా శ్రీను, యార్లగడ్డ శ్రీనివాసరావు, ఏకుల స్వాములు, మురాల రామారావు, ఇనుముల ఎలేసు, అరేపల్లి ప్రభు దాస్, తదితరులు పాల్గొన్నారు.