Jul 14,2022 22:34

సమస్యలు పరిష్కరించండి
కలెక్టరేట్‌ ఎదుట ఆశాల ధర్నా
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:
ఆశా వర్కర్లకు సుప్రీమ్‌ కోర్డు ఆదేశాల మేరకు కనీస వేతనం రూ.21వేలు చెల్లించాలని పనిభారాన్ని తగ్గించాలని, సంక్షేమ పథకాలు, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ కల్పించాలని కోరుతూ గురువారం జిల్లా కలెక్టరేట్‌ ఎదుట ఆశా వర్కర్లు సిఐటియు నేతృత్వంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా సిఐటియు నాయకులు సురేంద్రన్‌, ఆశా వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్ష, కార్యదర్శులు గంగ, పద్మలు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆశాలకు రూ.10వేలు జీతం పెంచి ప్రభుత్వ సంక్షేమపథకాలు వర్తించవని ప్రకటించడం అత్యంత దారుణమన్నారు. ఆశాల గౌరవ వేతనం రూ.15వేలకు పెంచాలని, పెరుగుతున్న ధరలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఆశాల జీతాలు పెంచాలన్నారు. కోవిడ్‌ కారణంగా మరణించిన వారికి 10 లక్షల ఎక్స్‌గ్రేషియో, 10 లక్షల గ్రూపు ఇన్సురెన్స్‌, ఎస్‌హెచ్‌ఎం నిబంధనల మేరకు 1000- 1200 మందికి ఒక ఆశా వర్కర్క్‌, సంక్షేమ పథకాల అమలు, నాణ్యమైన సెల్‌ఫోన్సు, ఎఎన్‌ఎంల నియామాకాల్లో ఆశాలకు వెయిటేజీ మార్కులు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు ప్రియ, వనజాక్షి, కృష్ణవేణి, సుబ్బలక్ష్మి, తేజోవతి, లక్ష్మిలతో పాటు పెద్దసంఖ్యలో ఆశావర్కర్లు పాల్గొన్నారు.